తిరుమలలోని శారదాపీఠం చేపట్టిన అక్రమ భవన నిర్మాణం విషయంలో ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీల్లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ భవనం నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ‘ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది.
అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరిపితే ఏం జరుగుతుందో ఈ కేసు ఒక ఉదాహరణ కావాలని హైకోర్టు పేర్కొంది. విశాఖ శారదాపీఠం తిరుమలలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నప్పటికీ టీటీడీ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది తుమ్మా ఓంకార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
గతంలోనే ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపి భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఈ పిల్పై మరోసారి విచారణ జరిగింది. శారదాపీఠం భవనాన్ని సీజ్ చేస్తూ టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని శారదాపీఠం తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అందుకు అనుమతిస్తూ తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
తిరుమలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ అండదండలతో విశాఖ శారదాపీఠం భూకబ్జాకు పాల్పడిందని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా శారదాపీఠం అక్రమ నిర్మాణాలను గత టీటీడీ ధర్మకర్తల మండలి క్రమబద్దీకరించిందని విమర్శించారు. కబ్జా చేసిన ప్రాంతంలో అక్రమంగా నిర్మాణాలు చేశారని గతంలో ఈవో ధర్మారెడ్డికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
అక్రమ కట్టడాలను వెంటనే నిలుపుదల చేయాలని గత ప్రభుత్వ హయంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాతకట్టడాల మీద హైకోర్టును ఆశ్రయించానని చెప్పారు. టీటీడీ ధర్మకర్తల మండలి మొదటి సమావేశంలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన విశాఖ శారదా పీఠం అక్రమకట్టడాలను ఊపేక్షించేది లేదని స్ధలాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
వైజాగ్ విజ్ఞాన్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
మూడురోజుల పాటు తిరుపతిలో టెంపుల్ ఎక్స్పో