ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష

ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష

దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ పరీక్షలు నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్‌పేపర్ పద్ధతి లోనే నిర్వహించనున్నట్టు వెల్లడించింది.  సింగిల్‌ డే – సింగిల్‌ షిఫ్ట్‌లో పెన్‌- పేపర్‌ మోడ్‌ (ఓఎంఆర్‌ బేస్డ్‌)లో నీట్‌ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది.  నేషనల్‌ మెడికల్‌ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఖరారు చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. కేంద్ర విద్య, ఆరోగ్యశాఖల మధ్య సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపింది.

 “నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయం ప్రకారం నీట్ యూజీ పరీక్ష పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహిస్తాం. ఒకే రోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్ష ఉంటుంది ” అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఏ ) అధికారి వెల్లడించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్‌యూజీ నిలుస్తోంది.  2024లో 21 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రారు. జేఈఈ మెయిన తరహా లోనే ఈసారి (2025) కూడా నీట్ యూజీని ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని ఎన్‌టీఏ భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 

ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ ఛైర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ కూడా ఆన్‌లైన్ విధానం (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ) లో నిర్వహించాలని సిఫార్సు చేసింది. అయితే తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్య శాఖలు జరిపిన విస్తృత చర్చల్లో ఓఎంఆర్ పద్ధతికే మొగ్గు చూపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌ కోర్సులకు యూనిఫామ్‌ నీట్ (యూజీ) పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది.

నీట్‌ (యూజీ) ఫలితాల ఆధారంగా నేషనల్‌ కమిషన్ ఫర్‌ హోమియోపతి కింద బీహెచ్‌ఎంఎస్‌ కోర్సు అడ్మిషన్లు నిర్వహిస్తారు.  దీంతోపాటు ఆర్మ్‌డ్‌ మెడికల్‌ సర్వీస్‌ హాస్పిటల్స్‌లో బీఎస్‌సీ నర్సింగ్‌ కోర్సు అడ్మిషన్లకు నీట్ (యూజీ) క్వాలిఫై కావాల్సి ఉంటుంది. నాలుగేండ్ల బీఎస్‌సీ నర్సింగ్‌ కోర్సుకు కూడా నీట్‌ (యూజీ) కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని ఎన్టీఏ తెలిపింది.