మోదీ, అమిత్ షా ల ఎఐ ఫోటోలు వాడిన ఆప్ పై కేసు

మోదీ, అమిత్ షా ల ఎఐ ఫోటోలు వాడిన ఆప్ పై కేసు
ఎఐ ద్వారా రూపొందించబడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ఫోటోలు, వీడియోలను పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.  ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వకుండానే నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. 
 
ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ప్రధానమంత్రి, హోంమంత్రికి సంబంధించిన కొన్ని అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోల గురించి తమకు ఫిర్యాదు అందిందని ఆ వర్గాలు తెలిపాయి. ఆరోపించిన వీడియోలను జనవరి 10, 13 తేదీల్లో ఆప్ పోస్ట్ చేసింది. 
 
ఆప్-డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా రూపొందించిన వీడియోలలో ఒకటి 90ల నాటి బాలీవుడ్ చిత్రం నుండి విలన్ల ముఖాలను బిజెపి నాయకుల ముఖాలతో మార్చి, ఆడియోను ఢిల్లీ ఎన్నికలపై సంభాషణగా మార్చిన దృశ్యాన్ని చూపించిందని ఒక అధికారి తెలిపారు. ఫిర్యాదును విశ్లేషించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిదని, దర్యాప్తు ప్రారంభించబడిందని అధికారి తెలిపారు. 
 
ఈ పరిణామంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ, ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఇది బిజెపికి సర్వసాధారణమని పేర్కొంది. ప్రజలకు సంబంధించిన నిజమైన సమస్యల నుండి దృష్టిని మళ్లించడానికి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించింది. దీని తర్వాత రాజకీయ కక్ష్యతో ముఖ్యమంత్రి అతిషి, మనీష్ సిసోడియాలను అరెస్టు చేసే అవకాశం ఉందని,  వారిని లక్ష్యంగా చేసుకునే వారిపై సోదాలు చేసే అవకాశం ఉందని ఆప్ ప్రకటన ఆరోపించింది. 
 
“అయితే, ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం, నకిలీ ఎంట్రీలను జోడించడం, నిజమైన ఓటర్లను తొలగించడం  వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో స్పష్టంగా పాల్గొన్న బిజెపి నాయకులపై,  ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆప్ ఆరోపించింది.