విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టవద్దని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) సహా పలు కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి. ఈ కర్మాగారంతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా విక్రయించవద్దని, సాధ్యమైనంత మేరకు వాటికి నిధులు కేటాయించి బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్కు సన్నాహకంగా నిర్వహించే ప్రి-బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం 11 కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం విశాఖ పర్యటనకు వస్తున్న సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్ పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలో కీలక కార్మిక సంఘాలు ఈ విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. మరోవంక, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని లేదా సెయిల్లో విలీనం చేసి పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడుపుతామని ఎనిమిదో తేదీన విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది.
సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ అయిన బీఎంఎస్ ప్రతినిధి పవన్కుమార్ విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా వ్యతిరేకించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పింఛను పథకాన్ని రద్దు చేసి పాత పింఛను పథకాన్నే (ఓపీఎస్) పునరుద్ధరించాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఇళ్లలో పనిచేసేవారి డేటా సేకరించి వారికి సామాజిక భద్రత కల్పించే విషయం పరిశీలిస్తామని నిర్మల హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈపీఎఫ్ కనీస పెన్షన్ను రూ.5 వేలకు పెంచాలని, ఐటీ మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని, ‘గిగ్’ కార్మికులకు కనీస వేతనాలు కల్పించాలని సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
More Stories
తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నం
పోలవరం పనులపై పార్లమెంటరీ కమిటీ అధ్యయనం
చివరకు తొక్కిసలాటపై క్షమాపణ చెప్పిన టిటిడి చైర్మన్