మల్లారెడ్డి కాలేజీ గర్ల్స్ హాస్టల్లో రహస్య వీడియో కెమెరాలు!

మల్లారెడ్డి కాలేజీ గర్ల్స్ హాస్టల్లో రహస్య వీడియో కెమెరాలు!
 
హైదరాబాద్ శివారు మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలోని మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్‌ బాత్ రూముల్లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో పని చేసే వంట సిబ్బందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

వీడియోల ఘటనపై కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ  హామీ ఇచ్చారు. కాగా, ఈ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పోలీసులు హాస్టల్ సిబ్బందికి చెందిన 12 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులు బాత్రూమ్‌లో కెమెరాలు పెట్టి సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అవి సోషల్ మీడియాలో లీక్ అయితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించాలని కోరుతున్నారు.

హాస్టల్ సిబ్బంది బాత్రూమ్స్ వెంటిలేటర్ నుంచి వీడియోలు తీశారని, ఈ విషయం వార్డెన్‌కు చెప్పామని స్టూడెంట్స్ చెబుతున్నారు. కానీ హాస్టల్ వార్డెన్ వారికే వత్తాసు పలుకుతూ.. తమపైనే అసభ్యంగా మాట్లాడారని బాధిత స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్యెల్యే  మల్లారెడ్డే బాధ్యత వహించాలని విద్యార్థినీలు డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థుల బాత్రూమ్ వీడియోలు బయటకు వస్తే పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాల నాయకులు గతరాత్రి అక్కడకు చేరుకున్నారు.

వారిని సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే ధర్నా చేపట్టారు. ఆవేశంతో సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిర్వాహకులతో మాట్లాడారు. హాస్టల్లో పని చేసే సిబ్బంది ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. దీంతో శాంతించిన విద్యార్థి సంఘం నాయకులు వీడియోలు తీసిని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఇది ఇలావుండగా, ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. సదరు వీడియోలతో విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేసి విషయం బయటకు రాకుండా చూసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.