
కర్నాటకలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా నగరం అంతా పోస్టర్లను ప్రదర్శించారు. అయితే ఆ పోస్టర్లపై ఉన్న భారత దేశ మ్యాప్ను తప్పుగా చిత్రీకరించారు. ఆ పోస్టర్లలో ఉన్న మ్యాప్ల పాక్ ఆక్రమిత గిల్గిత్ ప్రాంతం కానీ, చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతం లేవని బీజేపీ ఆరోపించింది. ఆ రెండు ప్రాంతాలు జమ్మూకశ్మీర్లోనివే.
కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. రాహుల్ గాంధీ మొహబత్ కి దుకాన్ ఎప్పుడూ చైనా కోసం తెరిచి ఉంటుందని, ఈ దేశాన్ని ముక్కలు చేస్తారని, గతంలో చేశారని, మళ్లీ చేస్తారని బీజేపీ ఆరోపించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ భారతదేశ మ్యాప్ను సరిగా చిత్రీకరించలేదని బీజేపీ విమర్శించింది.
సమావేశాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసు కేసు రిజిస్టర్ చేయాలని విజయపురా బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ డిమాండ్ చేశారు. ఇండియా మ్యాప్ను సరైన రీతిలో చిత్రీకరించని పక్షంలో అది ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేశారు. తప్పుడు మ్యాప్ను ప్రచురించడం ఐపీసీలోని సెక్షన్ 74 ప్రకారం నేరం అని పేర్కొంటూ నేషనల్ హానర్ యాక్టు ప్రకారం కూడా ఉల్లంఘనే అని తెలిపారు.
అమెరికాకు చెందిన బిలియనీర్ పెట్టుబడిదారుడు జార్జ్ సోరోస్ వంటి భారత వ్యతిరేక శక్తుల నుండి వచ్చిన సంకేతాన్ని కాంగ్రెస్ అనుసరిస్తుందా? అని బిజెపి ప్రశ్నించింది. బెళగావి సమావేశంలో కాంగ్రెస్ వక్రీకరించిన భారతీయ పటాలను ఉపయోగించిందని బిజెపి ఎంపి సుధాన్షు త్రివేది ఆరోపించారు. బిజెపి కర్ణాటక రాష్ట్ర విభాగం ‘బిజెపి4కర్ణాటక’ సోషల్ మీడియా పోస్ట్ను ఉటంకిస్తూ త్రివేది ఈ ఆరోపణలు చేశారు.
‘బిజెపి4కర్ణాటక’ సోషల్ మీడియా పోస్ట్లో, “@INCKarnataka, వారి బెళగావి కార్యక్రమంలో వక్రీకరించిన పటాన్ని ప్రదర్శించడం ద్వారా, కాశ్మీర్ను పాకిస్తాన్లో భాగంగా చిత్రీకరించడం ద్వారా భారతదేశ సార్వభౌమత్వాన్ని పూర్తిగా అగౌరవపరిచింది. ఇదంతా వారి ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికే. ఇది సిగ్గుచేటు!” భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులతో కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయని ఈ సంఘటన స్పష్టం చేసిందని బిజెపి ఎంపి సుధాన్షు త్రివేది పేర్కొన్నారు.
దేశం వీర్ బాల్ దివస్ను జరుపుకుంటున్నప్పుడు, కాంగ్రెస్ “వక్రీకరించిన పటాలను” ఉపయోగిస్తోందని, ఇది “హృదయాలను బాధపెడుతుందని” సుధాంశు త్రివేది ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు, బిజెపి నాయకుడు షెహజాద్ పూనవాలా కూడా కాంగ్రెస్ బెళగావి సమావేశంలో వక్రీకరించిన భారతీయ పటాలను ఉంచిందని ఆరోపించారు. ఇది ‘భారత్ తోడో, తుక్డే-తుక్డే’ కాంగ్రెస్ మనస్తత్వాన్ని చూపిస్తుందని, ఇది భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యతపై దాడి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, పోస్టర్లలో ఏదైనా పొరపాటు ఉంటే, వాటిని తొలగిస్తామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు. బహుశా కొందరు తప్పు చేసి ఉంటారని, వాటిని తొలగిస్తున్నామని ప్రకటించారు. అయితే, కావాలని బీజేపీ తమపై దాడి చేస్తోందని చెబుతూ ఈర్ష్యకు మందు లేదని ధ్వజమెత్తారు.
భారత్ మ్యాప్ లో పొరపాట్లు చోటుచేసుకోవడం పట్ల కాంగ్రెస్ నేత బివి శ్రీనివాస్ క్షమాపణలు తెలిపారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్ష పదవి మహాత్మా గాంధీ చేపట్టి 100 ఏళ్ళు అయినా సందర్భంగా తాము ఉత్సవాలు జరుపుకోవడం ఇష్టం లేకనే బిజెపి దీనిపై వివాదం సృష్టిస్తుందని విమర్శించారు.
More Stories
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
నాగ్పుర్లో ఉద్రిక్త పరిస్థితులు.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ