శ్రీతేజ్‌ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం

శ్రీతేజ్‌ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం
సంధ్య థియేటర్‌ వద్ద డిసెంబర్‌ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్‌ కు గాయాలవగా ప్రస్తుతం శ్రీతేజ్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా  బుధవారం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌ రాజు, నిర్మాత అల్లు అరవింద్‌ తో కలిసి కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించారు. కుటుంబసభ్యులు, డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రేవతి కుటుంబానికి పుష్ప టీం రూ.2 కోట్లు పరిహారం ప్రకటించింది. అల్లు అర్జున్‌ రూ.కోటి, సుకుమార్‌ రూ.50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్‌ రూ.50 లక్షలు ప్రకటించగా పరిహారం చెక్కులను అల్లు అరవింద్‌ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్ రాజుకు అందజేశారు. ఈ మేరకు అల్లు అరవింద్‌, దిల్ రాజు కలిసి శ్రీతేజ్‌ కుటుంబసభ్యులకు చెక్కు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీతేజ్‌ కుటుంబానికి తమ తరపున మొత్తం రూ.2 కోట్ల పరిహారం అందజేస్తున్నామని, శ్రీతేజ్ కోలుకుంటున్నాడని అల్లు అరవింద్‌ తెలిపారు. శ్రీతేజ్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటున్నామని ఆశిస్తున్నామని చెప్పా రు. అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ..శ్రీతేజ్‌ త్వరగా కోలుకుంటున్నాడని, నిన్నటి నుంచి ఇప్పటివరకు రికవరీ వేగంగా ఉందని పేర్కొన్నారు. శ్రీతేజ్‌ 72 గంటల నుంచి వెంటిలెటర్‌ లేకుండా ఉన్నాడని పేర్కొంటూ పరిహారం సొమ్ము సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

నటులు, నిర్మాతలు, డైరెక్టర్లతో గురువారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నట్లు దిల్ రాజు వెల్లడించారు. ఎఫ్‌డీసీ తరపున ఈ సమావేశం నిర్వహిస్తున్నామని చెబుతూ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలని సీఎం అడిగారని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ టవర్స్‌లో సీఎంతో సమావేశమవుతామని దిల్ రాజు తెలిపారు.