
కొత్తగా అమలు చేయనున్న విధానం ప్రకారం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు తమ పొదుపు మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు ఏటీఎంలలో ఉపయోగించుకునే విధంగా ఉండే ప్రత్యేక కార్డులు అందజేస్తామని కార్మిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమ 7 కోట్ల మందికి పైగా ఖాతాదారులకు బ్యాంకింగ్ వ్యవస్థకు దీటుగా సేవలను కల్పించాలని ఈపీఎఫ్ఓ యోచిస్తున్నట్లు చెప్పారు.
ఈపీఎఫ్ఓ ఖాతాదారులు త్వరలోనే బ్యాంకింగ్ సిస్టమ్తో సమానంగా సేవలు పొందనున్నారని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా వెల్లడించారు. ఖాతాదారులు ఇకపై తమ పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. ఇందుకోసం ఈపీఎఫ్ఓ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు.
ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి పైనే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దృష్టి పెట్టినట్లు ఆమె తెలిపారు. ఈపీఎఫ్ఓ వ్యవస్థను బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు. కొత్త విధానం కింద క్లెయిమ్దారులు, లబ్ధిదారులు లేదా బీమా పొందిన వ్యక్తులు ఏటీఎంల ద్వారా తమ డబ్బును తీసుకోవచ్చని ఆమె చెప్పారు.
మరణించిన ఖాతాదారుల వారసులకు ఈడీఎల్ఐ పథకం కింద గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు సమకూరుస్తామని ఆమె వివరించారు. కొత్త విధానంలో మరణించిన ఈపీఎఫ్ఓ ఖాతాదారుని వారసులు కూడా సెటిల్మెంట్ డబ్బును ఏటీఎంల ద్వారా తీసుకోవచ్చని చెప్పారు. 2025 జనవరిలోపు హార్డ్వేర్ అప్గ్రేడేషన్ జరిగే అవకాశం ఉంది. దీని వల్ల ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు పొందడానికి వీలవుతుంది.
More Stories
కేజ్రీవాల్ అధికారిక నివాసం `శీష్మహల్’ పై సివిసి దర్యాప్తు
తగ్గనున్న వంట నూనెల ధరలు
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు