
హీర్యా నాయక్ కి గుండెల్లో నొప్పి వస్తే వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపిందని మండిపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసిందని ఆరోపణలు చెలరేగుతున్నాయి. సకాలంలో ఆసుపత్రికి తరలించకుండా అమానవీయంగా వ్యవహరించిందని విమర్శలు చెలరేగాయి.
లగచర్ల రైతు హీర్యానాయక్ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై సర్వత్రా ఆగ్రవేశాలు వ్యక్తం అవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహిందని స్పష్టం చేశారు. హీర్యానాయక్ అంశంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
రైతుకు బేడీలు వేసిన ఘటనలో సంగారెడ్డి జైలర్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డిజి సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై విచారించిన ఐజి సత్యనారాయణ విచారణ ఖైది హీర్యా నాయక్ను లగచర్ల రైతుగా పేర్కొనకుండా బాలానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఒక కేసులో నిందితుడిగా చూపడం వల్లనే అతనికి బేడీలు వేసినట్లు బయటపడిందని తెలిపారు. ఈ ఘటనలో జైలు అధికారుల తప్పిదం అడుగడుగునా కనిపించిందని ఆయన పేర్కొన్నారు.
కలెక్టర్పై దాడి చేసిన ఘటనలో రైతు హీర్యానాయక్తో 14 మంది రైతులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. వీరంతా ప్రస్తుతం సంగారెడ్డి జైలులో విచారణ ఖైదీలుగా ఉండగా, ఇందులో హీర్యానాయక్ పై బిఎన్ఎఎస్ (భారత్ న్యాయ్ సంహిత) సెక్షన్ 191 కింద కేసు నమోదు అయింది.
కాగా ఈ సెక్షన్ తీవ్రమైన నేరం కాకపోవడంతో నిందితునికి బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే అంశం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బిఎన్ఎస్ సెక్షన్ 191 కింద కేసు నమోదు చేసిన నిందితునికి బేడీలు వేయడం రాజ్యాంగంలోని 14,16, 19 ఆర్టికల్స్కు విరుద్దమని నిందితుని తరఫు న్యాయవాదులు తప్పుపట్టారు. ఇది నూతన క్రిమినల్ చట్టానికి, పోలీసు, జైలు మాన్యువెల్స్కు కూడా విరుద్దమని, పైగా అండర్ ట్రయల్ ఖైదీల హక్కులను హరించడమే అవుతుందని ఆక్షేపించారు.
లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును వెనక్కి తీసుకున్న సర్కార్, రైతుల పైనా పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు. మరోవైపు తమ బిడ్డకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హీర్యానాయక్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
More Stories
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు
భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు .. చైనా, పాక్ కలవరం