సిరియా నుంచి 75 మంది భార‌తీయుల త‌రలింపు

సిరియా నుంచి 75 మంది భార‌తీయుల త‌రలింపు
అంత‌ర్యుద్ధంతో ర‌గిలిపోతున్న సిరియా నుంచి సుమారు 75 మంది భార‌తీయుల్ని సుర‌క్షితంగా తీసుకువ‌చ్చిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.  సిరియాలో నెలకొన్న పరిస్థితుల మధ్య అక్కడున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా 75 మంది భారత పౌరులను డమాస్కస్‌ నుంచి లెబనాన్‌కు సురక్షితంగా తీసుకొచ్చింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సాయుధ పోరాటం చేప‌ట్టిన రెబల బాష‌ర్ అల్ అస‌ద్ ప్ర‌భుత్వాన్ని కూల్చిన విష‌యం తెలిసిందే. ప్రాణ భ‌యంతో అస‌ద్‌ విదేశాల‌కు పారిపోయారు. ఆయ‌న‌కు ర‌ష్యా ఆశ్రయం క‌ల్పిస్తున్న‌ది. సిరియాలో చిక్కుకున్న వారిలో జమ్మూకశ్మీర్‌కు చెందిన జైరిన్‌ (యాత్రికులు)లు ఉన్నారని మంత్రిత్వశాఖ పేర్కొంది. వారంతా సిరియా సరిహద్దులు దాటి క్షేమంగా లెబనాన్‌కు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్కడ నుంచి వారంతా వాణిజ్య విమానాల ద్వారా లెబనాన్‌ నుంచి త్వరలోనే స్వదేశానికి చేరుకోనున్నట్లు తెలిపింది.

కాగా, ఇంకా కొంద‌రు భార‌తీయులు సిరియాలోనే ఉండిపోయారు. వాళ్లు డ‌మ‌స్క‌స్‌లో ఉన్న ఎంబ‌సీతో ట‌చ్‌లో ఉండాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. వారంతా డమాస్కస్‌లోని రాయబార కార్యాలయంతో +963 993385973 వాట్సప్‌లో, hoc.damascus@mea.gov.in ఇ-మెయిల్‌ ద్వారా టచ్‌లో ఉండాలని పేర్కొంది. అస‌ద్ కుటుంబం సుమారు అయిదు ద‌శాబ్ధాల నుంచి సిరియాను పాలిస్తున్న‌ది. అయితే రెబ‌ల్స్ తిరుగుబాటుతో.. ఆదివారం దేశాన్ని విడిచి వెళ్లారు.