భారతీయులందరూ తిరిగి తమ మూలాల్లోకి వెళ్లాలి

భారతీయులందరూ తిరిగి తమ మూలాల్లోకి వెళ్లాలి
భారతీయులందరూ తిరిగి తమ మూలాల్లోకి వెళ్లాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మన భాష, మన వేషధారణ, మన సంస్కృతిని మరిచిపోయామని, తిరిగి ప్రతి ఒక్కరూ మన సంప్రదాయానికి రావాల్సిన అవసరం వుందని ఆయన స్పష్టం చేశారు.  భాగ్యనగరం వేదికగా నాలుగు రోజుల పాటు శిల్పారామంలో జరుగుతున్న లోకమంథన్ భాగ్యనగర్ 2024 ఎగ్జిబిషన్ ను వెంకయ్యనాయుడు గురువారం ప్రారంభిస్తూ భారతీయ సనాతన ధర్మం ఎంతో గొప్పదని, మనతో పాటు జంతు జాలాలను కూడా బతికించుకునే సంస్కృతి మనదని కొనియాడారు. 
 
 పాశ్చాత్యులు భారతీయుల మనస్సులను కూడా దోచుకెళ్లారని, అందుకే ఇప్పుడు మనలో మార్పులు వచ్చాయని, మన సంస్కృతిని, మన భాషను, మన సాహిత్యాన్ని, మన సంగీతాన్ని, మన మాటలను, మన వాయిద్యాలను మరిచిపోయి, ఇంగ్లీషు వైపు వెళ్లిపోయామని ఆయన విచారం వ్యక్తం చేశారు. తిరిగి భారతీయ మూలాలకు వెళ్లి, భారతీయ భాషలను ప్రోత్సహించాలని ఆయన స్పష్టం చేశారు. 
 
ముందుకు మాతృభాష వైపు మళ్లాలని, ఆ తర్వాత ఏ భాష వైపు అయినా మళ్లాలని వెంకయ్య నాయుడు సూచించారు. తాము ఏ భాషకీ వ్యతిరేకం కాదని, కానీ అసలు భాషైన అమ్మ భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అమ్మభాష కళ్లలాంటిదని, ఇంగ్లీషు కళ్లద్దాల్లాంటిదని, కళ్లే లేకపోతే ఎంత మంచి కళ్లద్దాలున్నా దండగేనని తేల్చి చెప్పారు. వలసవాద బుద్ధిని వదిలి, తిరిగి మన మూలాల్లోకి వెళ్లడమే లోకమంథన్ ఉద్దేశమని ఆయన వివరించారు.
 
చీమకి చక్కెర, పాముకి పాలు పోయడం, చెట్టుకు బొట్టు పెట్టే పవిత్ర సంస్కృతి హిందువులది అని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పాశ్చాత్యమోహంలో పడిపోయామని తెలిపారు. బ్రిటీషులు, విదేశీయులు భారత్ పై దండయాత్ర చేసి దోపిడీ చేశారని పేర్కొంటూ కేవలం ధనాన్ని దోపిడీ చేయడమే కాకుండా భారతీయ మనస్సులను కూడా మార్చేశారని ఆయన పేర్కొన్నారు. 
 
అందుకే ఇప్పుడు భారతీయులు మన మూలాలను మరిచిపోయి, పాశ్చాత్యం వైపు మళ్లిపోయామని తెలిపారు. భాగ్యనగరం వేదికగా జరుగుతున్న లోకమంథన్ కార్యక్రమానికి హైదరాబాద్ వాసులు, చుట్టుపక్కల జిల్లాల వాసులందరూ తరలివచ్చి, మన మూలాలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.
 
ఈ దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కూడా మాతృభాషలోనే చదువుకున్నారని, స్వయంగా తాను కూడా ఓ వీధి బడిలో చదువుకున్నానని వెంకయ్య నాయుడు తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ తన చదువుకునే సమయంలో కాన్వెంట్ మొహమే చూడలేదని, అయినా గొప్ప వ్యక్తి అయ్యారని గుర్తు చేశారు. 
 
తాను ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినా సరే తన వేషధారణలో మార్పు చేయలేదని ప్రకటించారు. అందుకే మన మాతృభాషను, మన సంస్కృతిని ఆచరించడంలో, హిందువునని ప్రకటించడంలో, మన మన ప్రాంతం చెప్పే సమయంలో సిగ్గు పడొద్దని, అత్యంత గర్వంగా ప్రకటించుకోవాలని సూచించారు.

మనకు పురాతనంగా వస్తున్న సంప్రదాయాలను ఆచరించాలని చెబుతూ మాతృభాషను అందరూ మాట్లాడాలని స్పష్టం చేశారు. ఇంగ్లీషు వ్యామోహం అస్సలే పనికిరాదని హితవు చెప్పారు. మనకు పురాతనం నుంచి వస్తున్న సంగీత సాధనాలకు, సాహిత్యానికి అందరూ గౌరవించాలని, ఆదరించాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. 
 
విదేశాల్లో వున్న తెలుగు వారు తెలుగును బాగా ఆదరిస్తున్నారని కానీ, మనం మాత్రం ఇక్కడ ఇంగ్లీష్ మోజులో పడ్డామని విచారం వ్యక్తం చేశారు. ఈ పంచభూతాల్లో దైవత్వాన్ని చూసే సంప్రదాయం హిందువులదని, అలాగే బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసాశ్రమంఅన్న చతురాశ్రమ ధర్మాలను కూడా హిందూ ధర్మం బోధించిందని వివరించారు.
 
ప్రకృతితో అందరూ స్నేహపూర్వకంగా వుండాలని, సంస్కృతిని కూడా ఆచరిస్తూ పోతే అందరి జీవితాలు బాగుంటాయని వెంకయ్య నాయుడు సూచించారు. చిన్నతనం నుంచే పిల్లలను కష్టపడే తత్వం నేర్పించాలని, శారీరిక శ్రమ చేయాలని చెబుతూ యోగ ద్వారా యోగ్యులవుతారని తెలిపారు. యువకులందరూ శారీరకంగా బలిష్ఠంగా వుంటేనే మానసికంగా దృఢంగా వుంటారని చెప్పారు. 
 
హిందూ సంప్రదాయానికి కుటుంబ వ్యవస్థే కీలకమని వెంకయ్యనాయుడు తెలిపారు. కుటుంబ వ్యవస్థను పటిష్ఠంగా వుంచుకోవాలని,  కుటుంబంలో వుండే పెద్దవారితో సమయం గడపాలని సూచించారు. కుటుంబ వ్యవస్థ భారతీయతకే ప్రత్యేకత అని, అప్పుడే ప్రపంచానికి ఆదర్శంగా వుంటామని వెంకయ్య నాయుడు చెప్పారు.
 
సమాజంలో నేడు వ్యాప్తి చెందుతున్న వికృతులకు కారణం సంస్కృతి, జీవన విధానం ధ్వంసం కావడమే మూల కారణమని తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సంస్కృతి అంటే ఓ జీవన విధానమని, కానీ.. అది నేడు ధ్వంసమైందని చెప్పారు. అయితే… వీటిని సైన్స్ అస్సలు కాపాడలేదని, సంస్కృతే సమాజాన్ని కాపాడుతుందని స్పష్టం చేశారు. మనమందరమూ తిరిగి నైతిక విలువలను, సంస్కృతిని, సంప్రదాయాలను తిరిగి సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు.  కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ప్రజ్ఞాభారతి అధ్యక్షుడు టి హనుమాన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.