కేజ్రీవాల్ పిటీష‌న్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

కేజ్రీవాల్ పిటీష‌న్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
* ప్రధాని డిగ్రీపై వాఖ్యలతో పరువునష్టం కేసు

ప్ర‌ధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివాదంలో తనపై న‌మోదు అయిన పరువునష్టం కేసులో కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ప్ర‌ధాని డిగ్రీపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఆయ‌న‌పై గుజ‌రాత్ యూనివ‌ర్సిటీ ప‌రువున‌ష్టం కేసును దాఖ‌లు చేశారు. ఆ కేసులో ట్ర‌య‌ల్ కోర్టు స‌మ‌న్లు జారీ చేశారు.

ఆ స‌మ‌న్ల‌ను కొట్టివేయాల‌ని కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్ర‌యించారు. అయితే ట్ర‌య‌ల్ కోర్టు ఆదేశాల‌ను కొట్టివేసేందుకు సుప్రీం నిరాక‌రించింది.  జ‌స్టిస్ హృషికేశ్ రాయ్‌, ఎస్‌వీఎన్ భ‌ట్టిల‌తో కూడిన ధర్మాస‌నం ఈ కేసును విచారించింది.  గ‌తంలో ఇదే కేసులో ఆప్ నేత సంజ‌య్ సింగ్ వేసిన పిటీష‌న్‌ను కొట్టివేసిన‌ట్లు సుప్రీంకోర్టు గుర్తు చేసింది.

అయితే కేజ్రీవాల్ త‌ర‌పున సీనియ‌న్ న్యాయ‌వాది అభిషేక్ మ‌నూ సింఘ్వీ వాదిస్తూ సంజ‌య్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు భిన్న‌మైన‌వి ఆయ‌న కోర్టుకు చెప్పారు. కానీ ఆ పిల్‌ను విచారించేందుకు కోర్టు నిరాక‌రించింది.  సంజ‌య్ సింగ్‌పై కూడా గుజ‌రాత్ వ‌ర్సిటీ కేసు బుక్ చేసింద‌ని, ఈ కేసులో ఒక‌విధ‌మైన ఆదేశాలు ఉండాల‌ని, అందుకే కేజ్రీవాల్ పిటీష‌న్‌ను స్వీక‌రించ‌డం లేద‌ని, దాన్ని డిస్మిస్ చేస్తున్నామ‌ని కోర్టు చెప్పింది.

ప్రధాని మోడీ విద్యా ప్రమాణాలు ముఖ్యంగా గుజరాత్‌ యూనివర్శిటీలో ఆయన చేసిన డిగ్రీ చెల్లుబాటును కేజ్రీవాల్‌ బహిరంగంగా, మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తమ యూనివర్శిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా, అగౌరవ పరిచేలా ఉన్నాయని గుజరాత్‌ యూనివర్శిటీ వ్యాఖ్యానించింది. గుజరాత్‌ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ పీయూష్‌ పటేల్‌ కేజ్రీవాల్‌, ఆప్‌ నేత సంజరు సింగ్‌లపై పరువునష్టం కేసు దాఖలు చేశారు.

విచారణకు హాజరుకావాలని గుజరాత్‌ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలంటూ కేజ్రీవాల్‌ గుజరాత్‌ హైకోర్టును కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుజరాత్‌ హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించడంతో కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.