ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా విజయ కిశోర్‌

ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా విజయ కిశోర్‌

జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) నూతన చైర్‌పర్సన్‌గా విజయ కిశోర్‌ రహత్కర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం శనివారం నోటిషికేషన్‌ జారీ చేసింది. “సెక్షన్ 3,  ఎన్‌సీడబ్ల్యూ  చట్టం, 1990 ప్రకారం  కేంద్ర ప్రభుత్వం జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్ ని  నామినేట్ చేసిందని తెలుపడానికి ఎన్‌సిడబ్ల్యు ఆనందిస్తోంది.” అని మహిళా ప్యానెల్ ఎక్స్ పోస్ట్‌ లో పేర్కొంది.

రహత్కర్ నియామకంతో పాటు  ప్రభుత్వం ఆమెతో పాటు డా. అర్చన  మజుందార్ ను కమిషన్ సభ్యురాలిగా నియమించింది. ఎన్‌సిడబ్ల్యు చీఫ్‌గా ఉన్న రేఖా శర్మ పదవీకాలం ఆగస్టు 6తో ముగియడంతో విజయ కిషోర్ రహత్కర్ ఆ స్థానంలోకి వచ్చారు. ఆమె పదవీ కాలం మూడేళ్లు లేక ఆమెకు 65 ఏళ్లు నిండే వరకు ఉంటుంది.

ఆమె గతంలో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమె అక్కడ ఉన్న కాలంలో (2016-2021), ఆమె జీవితంలోని వివిధ కోణాల్లో మహిళల అభివృద్ధిపై దృష్టి సారించే అనేక కార్యక్రమాలపై పనిచేశారు. ముఖ్యంగా, రహత్కర్ “సక్షమా” (యాసిడ్ దాడి బాధితులకు మద్దతు), “ప్రజ్వల” (స్వయం సహాయక బృందాలను కేంద్ర ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేయడం),  “సుహిత” (మహిళల కోసం 24×7 హెల్ప్‌లైన్ సేవ) వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.

పోక్సో, ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చర్యలు, మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ల వంటి సమస్యలను పరిష్కరించే చట్టపరమైన సంస్కరణలపై కూడా ఆమె దృష్టి సారించారు. పైగా, ఆమె డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలను ప్రోత్సహించారు.  మహిళల సమస్యలకు అంకితమైన “సాద్” అనే ప్రచురణను ప్రారంభించారు.

మహిళల అభివృద్ధికి ఆమె చేసిన కృషితో పాటు, రహత్కర్ వివిధ రాజకీయ, సామాజిక వ్యాహారాలలో నాయకత్వ నైపుణ్యాలను కూడా ప్రదర్శించారు. జాతీయ యువమోర్చ ఉపాధ్యక్షురాలిగా, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఏడేళ్లుగా కీలక బాధ్యతలు నిర్వహించి, ప్రస్తుతం జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇంకా, రహత్కర్ 2007 నుండి 2010 వరకు ఛత్రపతి సంభాజీనగర్ మేయర్‌గా కూడా పనిచేశారు. ఆమె పదవీ కాలంలో ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేశారు. ఆమె నగరాన్ని అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రంగా ప్రచారం చేశారు. పర్యాటకం, స్థానిక ఆదాయాన్ని పెంచారు.

ప్రస్తుతం, ఆమె ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్‌లో అడ్వైజరీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎన్‌సీడబ్ల్యూ  చైర్‌పర్సన్‌గా తన పదవీకాలాన్ని ప్రారంభించనున్న విజయ రహత్కర్, మహిళా సాధికారతకు ఆమె చేసిన కృషికి అనేక అవార్డులు, గుర్తింపులను అందుకున్నారు.

ఆమెను జాతీయ సాహిత్య మండలి నుండి జాతీయ న్యాయ అవార్డు, సావిత్రిబాయి ఫూలే అవార్డుతో సత్కరించారు. రహత్కర్ విధిలిఖిత్ (మహిళల చట్టపరమైన సమస్యలపై), ఔరంగాబాద్: లీడింగ్ టు వైడ్ రోడ్స్‌తో సహా అనేక పుస్తకాలను కూడా రచించారు. ఆమె పూణే విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ, చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.