ప్రియాంక గాంధీపై పోటీగా బీజేపీ నుంచి మెకానికల్ ఇంజనీర్

ప్రియాంక గాంధీపై పోటీగా బీజేపీ నుంచి మెకానికల్ ఇంజనీర్
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ రాజీనామాతో జరుగుతున్న వయనాడ్ ఉపఎన్నికలో రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి ఆకట్టుకొంటోంది.  ఆమెపై పోటీకి బిజెపి నవ్య హరిదాస్ (39)అనే మహిళా నేతను పోటీకి దించుతోంది. వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల పోలింగ్ నవంబర్ 13న జరగనుండగా, ఫలితాలు నవంబర్ 23న వెలువడతాయి.
 
నవ్య హరిదాస్ ఓ మెకానికల్ ఇంజనీర్. 2007లో కాలికట్ యూనివర్సిటీ పరిధిలోని కేఎంసీటీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పట్టా పొందారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ లెక్కల ప్రకారం నవ్య హరిదాస్ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. అలాగే రూ.1,29,56,264 ఆస్తులు.. రూ.1,64,978 అప్పులు ఉన్నాయి. 
 
ఆమె ట్విటర్ ప్రొఫైల్ ప్రకారం నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా  రెండుసార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కార్పొరేషన్ లో బిజెపి పక్ష నాయకురాలిగా ఉన్నారు.  ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బీజేఎంఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు పేర్కొన్నారు. 2021లో కోజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికలలో ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
 
వాయనాడ్ నియోజకవర్గంలో ప్రజలకు కొంత అభివృద్ధి అవసరం అని చెబుతూ, అయితే  కాంగ్రెస్ వారికి చేసిందేమీ లేదని నవ్య హరిదాస్ చెప్పారు. “వాయనాడ్ నియోజకవర్గంలోని ప్రజలు అక్కడ కొంత పురోగతి సాధించాలి. కాంగ్రెస్ కుటుంబం వాయనాడ్ ప్రజల అవసరాలను వాస్తవంగా తీర్చడం లేదు. ఈ ఎన్నికల నుండి, వాయనాడ్ వాసులకు వారి సమస్యలను పరిష్కరించగల మంచి పార్లమెంటు సభ్యుడు కావాలి” అని ఆమె పేర్కొన్నారు.
 
“బిజెపి నన్ను ఈ యుద్ధానికి ఎంపిక చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. వారు వాయనాడ్ ప్రజలతో ఉండే నాయకుడి కోసం చూస్తున్నారని నేను భావిస్తున్నాను. అప్పుడప్పుడు వాయనాడ్‌కు వచ్చే వ్యక్తిని కాదు. పార్లమెంటు సభ్యుడు ఎప్పుడూ వారి వెంట ఉండాలి, వారి సమస్యలను అర్థం చేసుకొని, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. అందుకు ఇక్కడ బిజెపి ఉంది” అని ఆమె స్పష్టం చేశారు.
 
మరోవైపు వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికలో ఎల్డీఎఫ్ ఇప్పటికే సీపీఐ లీడర్ సత్యన్ మోకేరీ పేరును ప్రకటించింది. కోజికోడ్ జిల్లా నడపురం నియోజకవర్గం నుంచి సత్యన్ గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే వయనాడ్ లోక్‌సభ స్థానానికి గతంలో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. 2014 ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీచేసిన సత్యన్ కాంగ్రెస్ అభ్యర్థి షాన్వాజ్ మెజారిటీని భారీగా తగ్గించగలిగారు. 
 
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆయన వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. మరోవైపు వయనాడ్ అభ్యర్థితో పాటుగా అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఉపఎన్నికలకు కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.