కర్ణాటకలోని మాండ్యలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. గణపతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలతో పరిస్థితి అదుపు తప్పింది. నాగమంగళ పట్టణంలో గణేష్ విగ్రహ నిమజ్జనం కోసం బద్రికొప్పలు గ్రామానికి చెందిన కొందరు యువకులు ఊరేగింపు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో మైసూరు రోడ్డులోని దర్గా వద్ద రెండు వర్గాల యువకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కొందరు దుండగులు ఊరేగింపుపై రాళ్లు రువ్వడ్డంతో పరిస్థితి అదుపుతప్పింది. సమీపంలో ఉన్న షాపులను ధ్వంసం చేశారు. టైర్లను తగలబెట్టి రోడ్లపై పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జి చేశారు. అల్లర్లుకు పాల్పడిన 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, గణేశుడి విగ్రహాన్ని తీసుకుని పోలీసు స్టేషన్ వద్ద యువకులు నిరసన వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయకుండానే తమవారిని అరెస్టు చేశారని ధర్నాకు దిగారు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే విచారణ నిమిత్తం వారిని స్టేషన్కు తీసుకొచ్చామని, ఏ తప్పూ చేయకుండా ఉంటే వారిని వదిలేస్తామని పోలీసులు వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో బీఎన్ఎస్ఎస్ చట్టం సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు.
ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర స్పందిస్తూ ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని చెప్పారు. ఇప్పటివరకు 52 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. గణేషుడి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వారని తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని కేంద్ర మంత్రి, కర్నాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి విమర్శించారు.
మాండ్యలో ప్రస్తుతం పరిస్ధితి అదుపులో ఉందని, అయితే ఇప్పటికే అల్లరి మూకల దాడిలో విధ్వంసం జరిగిందని పేర్కొన్నారు. తాను శుక్రవారం ఘటనా స్ధలాన్ని సందర్శిస్తానని చెప్పారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే సమాచారం సేకరించానని తెలిపారు. గణేష్ ఊరేగింపును భగ్నం చేయాలని కొందరు దుండగులు ప్రయత్నించారని వివరించారు.
కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన అనంతరం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఓ వర్గం ప్రజల కోసమే పనిచేస్తున్నామనే సంకేతాలు పంపాలని కాంగ్రెస్ పాలకులు కోరుకుంటున్నారని ఆరోపించారు. అందుకే కర్నాటకలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.
కర్నాటక శాంతియుత రాష్ట్రమని, కన్నడిగులు ఇలాంటి మత ఘర్షణలకు మద్దతు ఇవ్వరని స్పష్టం చేశారు. ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇలాంటి ఘర్షణలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుజ్జగింపు రాజకీయాలు మంచిదికాదని సిద్ధరామయ్య సర్కార్కు హితవు పలికారు. తాను కూడా రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించానని, తాను అన్ని వర్గాలకు భద్రత కల్పించానని గుర్తుచేశారు. సమాజంలో ప్రతి ఒక్కరికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ప్రభుత్వం అందరికీ సరైన ప్రాధాన్యత ఇవ్వడం కీలకమని హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
కశ్మీర్లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు