
* చర్చలకు మమతా ప్రభుత్వం ఆహ్వానం
వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, డిమాండ్లు నెరవేర్చే వరకు విధుల్లో చేరబోమని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరాలని.. ఆ తర్వాత ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోబోమని కోర్టు నిరసన తెలుపుతున్న రెసిడెంట్ వైద్యులకు సోమవారం తెలిపింది. తిరిగి విధుల్లో చేరితే నిరసన తెలిపిన వైద్యులపై ఎలాంటి శిక్షార్షమైన చర్యలు, బదిలీలు చేపట్టబోమని బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. అయితే, వైద్యులు విధుల్లో చేరకుంటే వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది.
ఇలా ఉండగా, సమస్య పరిష్కారంకు ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లను మమతా బెనర్జీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. 10 మందికి మించకుండా వారి ప్రతినిధులు రాష్ట్ర సచివాలయంకు చర్చలకు రావాలని చెప్పింది. కాగా, వారితో చర్చలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కార్యాలయంలో ఎదురు చూస్తున్నారని ఆర్ధిక మంత్రి చంద్రమా భట్టాచార్య తెలిపారు.
అయితే తాము రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ఆరోగ్య కార్యదర్శి ఎన్ ఎస్ నిగమ్ నుండి చర్చలకు ఆహ్వానిస్తూ ఈమెయిల్ రావడం తమను అవమానించడమే అని జూనియర్ డాక్టర్ల ప్రతినిధి ఒకరు చెప్పారు.
డిమాండ్ల నెరవేర్చకపోతే సమ్మె కొనసాగిస్తామని ఆందోళన చేపడుతున్న వైద్యుల్లో ఒకరు తెలిపారు. కోల్కతా పోలీస్ కమీషనర్, హెల్త్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ను సాయంత్రం 5 గంటల్లోగా తొలగించామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని, చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ రూమ్లో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ మృతదేహం లభ్యమైన కొద్ది గంటలకే జూనియర్ డాక్టర్లు ఆగస్టు 9న తమ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. కాగా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి యాజమాన్యం 51 మంది వైద్యులకు నోటీసులు జారీచేసింది. బుధవారం విచారణ కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
ప్రజాస్వామ్య వాతావరణాన్ని ప్రమాదంలో పడేశారని, బెదిరింపు సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని, పని వాతావరణాన్ని పాడు చేశారంటూ నోటీసుల్లో పేర్కొంది. కమిటీ ఎదుట తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిందేనని ఆసుపత్రి అథారిటీ నోటీసుల్లో స్పష్టం చేసింది.
ఆర్జీ కర్ హాస్పిటల్ ప్రత్యేక కౌన్సిల్ కమిటీ నిర్ణయం ప్రకారం 51 మంది వైద్యులను విచారణ కమిటీ పిలిపించే వరకు ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. నోటీసులపై ఆసుపత్రి ప్రిన్సిపాల్ సంతకాలు చేశారు. కాలేజీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు నోటీసులో పేర్కొన్నారు. మరో వైపు ఆర్థిక అవకతవకల కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సెక్యూరిటీ గార్డు అఫ్సర్ అలీతో పాటు ఇద్దరు సహచరులు, కాంట్రాక్టర్ వెండర్ బిప్లబ్ సిన్హా, సుమన్ హజ్రాలకు కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
అవసరమైతే మళ్లీ కస్టడీని కోరుతామని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఆర్జీ కర్ ఎంసీహెచ్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసనల మధ్య ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సందీప్ ఘోష్ను సీబీఐ ఈ నెల 2న అరెస్టు చేసింది. 3న కోర్టులో హాజరుపరుచగా ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.
More Stories
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి
భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు .. చైనా, పాక్ కలవరం
రేవంత్ కట్టడి కోసమే తెలంగాణకు మీనాక్షి నటరాజన్!