ఎయిర్‌ఫోర్స్‌ మహిళా ఉద్యోగిపై అత్యాచారం!

ఎయిర్‌ఫోర్స్‌ మహిళా ఉద్యోగిపై అత్యాచారం!
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని వింగ్ కమాండర్‌పై తీవ్ర లైంగిక ఆరోపణలు చేస్తూ.. ఓ మహిళా ఉద్యోగి పోలీసులను ఆశ్రయించడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. గత 2 ఏళ్లుగా మానసికంగా, లైంగికంగా వింగ్ కమాండర్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని సదరు మహిళా ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించింది. 
 
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా వింగ్‌ కమాండర్‌పై కేసు పెట్టిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. తనను మానసికంగా వేధించడం మాత్రమే కాకుండా ఆ వింగ్‌ కమాండర్‌ అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆ మహిళా అధికారి బుద్గాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
 
శ్రీనగర్ ఎయిర్‌బేస్‌లో పనిచేస్తున్న ఆ వింగ్ కమాండర్ అదే బేస్‌లో పనిచేసే తనతో గత కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు బుద్గాం పోలీసులకు ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది. గత 2 సంవత్సరాలుగా తనను రకరకాలుగా ఆ వింగ్ కమాండర్ మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టినట్లు ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. 
 
అయితే ఈ ఘటనపై భారత వాయుసేనలోని ఇంటర్నల్ కమిటీకి ఫిర్యాదు చేసినా వింగ్ కమాండర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఆ వింగ్ కమాండర్ పేరు పీకే సెహ్రావత్ అని బాధితురాలు  తెలిపింది. అంతేకాకుండా తనతో అసహజ శృంగారంలో పాల్గొనాలని తనను పీకే సెహ్రావత్ బలవంతం చేస్తున్నాడని ఆరోపించింది. 
 
గత రెండేళ్లుగా లైంగికంగా, మానసికంగా అనేక రకాలుగా వేధిస్తున్నాడని ఆ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసుపై విచారణ చేపట్టిన బుద్గాం పోలీసులకు భారత వాయుసేన అధికారులు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పీకే సెహ్రావత్‌పై ఐపీసీ సెక్షన్ 376(2) కింద ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి చేసిన తీవ్రమైన అత్యాచారం అభియోగాలతో కేసు నమోదు చేశారు. 
 
అంతేకాకుండా తదుపరి దర్యాప్తు కోసం ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారికి ఈ కేసును  పోలీసులు అప్పగించారు.  ఇక ఆ వింగ్ కమాండర్.. గతేడాది డిసెంబర్‌ 31వ తేదీన తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఆఫీసర్స్ మెస్‌లో నిర్వహించిన న్యూ ఇయర్ పార్టీలో ఆ వింగ్ కమాండర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. 
 
ఆ రోజు రాత్రి 2 గంటలకు అందరికీ గిఫ్ట్‌లు ఇస్తుండగా తనకు రాకపోవడంతో రూంలోకి రమ్మని పిలిచాడని అక్కడ గిఫ్ట్ తీసుకుని వెళ్తుండగా అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు వాపోయింది. తనను అసహజ శృంగారం చేయాలని బలవంతపెట్టాడని ఫిర్యాదు చేసింది. వెంటనే తాను అతడ్ని నెట్టేసి అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించింది.
 
అయితే ఈ విషాన్ని ఇద్దరు మహిళా అధికారులకు చెప్పగా.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని వారు సూచించినట్లు తెలిపింది. కానీ ప్రత్యక్ష సాక్షులు లేనందున పీకే సెహ్రావత్‌పై చర్యలు తీసుకునేందుకు ఇంటర్నల్ కమిటీ అంగీకరించలేదని పేర్కొంది.  దీంతో పీకే సెహ్రావత్ రోజూ ఎంజాయ్ చేస్తుండగా తాను మాత్రం మానసిక క్షోభకు గురైనట్లు తెలిపింది. ఇక ఆ దర్యాప్తు ఈ ఏడాది మే 15వ తేదీతో ముగిసిందని.. కానీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించింది. పైగా తనకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని పేర్కొంది.