రష్యా, చైనా కీలక అధికారులతో అజిత్ దోవల్‌ భేటీ

రష్యా, చైనా కీలక అధికారులతో అజిత్ దోవల్‌ భేటీ
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు భారత్‌, చైనా, బ్రెజిల్‌లను మధ్యవర్తిత్వం వహించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ చేపట్టిన రష్యా పర్యటన ఆసక్తి కలిగిస్తున్నది. బ్రిక్స్‌ జాతీయ భద్రతాదారుల సదస్సులో పాల్గొనేందుకు ఆయన రష్యా వెడుతున్నారు.

అదే సమయంలో రష్యా, చైనా కీలక అధికారులతో ఆయన భేటీ కానున్నారు. గత నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్ మాట్లాడిన సమయంలో డోభాల్‌ పర్యటన అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిక్స్‌ ఎన్‌ఎస్‌ఏల సదస్సు సమయంలో ఉక్రెయిన్‌ శాంతి కోసం ఆలోచనలను ఆయన పంచుకుంటారని వెల్లడించినట్లు సమాచారం. తాము ముందునుంచి చెబుతున్నట్టు శాంతియుత పరిష్కారం ద్వారా యుద్ధం ముగించాలనే వైఖరికి భారత్ కట్టుబడి ఉందని మోదీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.

. గడచిన రెండు నెలల్లో రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని  నరేంద్ర మోదీ పుతిన్, జెలెన్‌స్కీలతో సమావేశమై శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువురి నేతలకు సూచించారు.  ఆ సమయంలో చర్చలు, దౌత్యమే యుద్ధానికి పరిష్కార మార్గాలని సూచించారు. తన వ్యక్తిగత హోదాలో ఓ మిత్రుడిలా ఉక్రెయిన్‌ శాంతి కోసం రష్యాతో మధ్యవర్తిత్వం చేస్తానని ఆఫర్‌ చేశారు. “యుద్ధంలో భారత్‌ ఏమాత్రం తటస్తంగా లేదు. కేవలం శాంతి పక్షమే వహిస్తోంది” అని మోదీ పేర్కొన్నారు.

అయితే, జెలెన్‌స్కీ నుంచి సానుకూల సమాధానం రాలేదు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశం యుద్ధం కొనసాగించేందుకు భారత్ మద్దతు ఇస్తున్నట్లు గుర్తు చేస్తూ, ఇటీవల యుద్ధం ఆపాలని జరిగిన అంతర్జాతీయ సమావేశం ప్రకటనపై భారత్ సంతకం చేయలేదని ప్రస్తావించారు. భారత్ ప్రతిపాదిస్తున్న శాంతి సందేశంపై స్పష్టత కలిగితే గాని తాను స్పందించలేనని ప్రధాని మోదీ ఇంకా తమ దేశంలో ఉండగానే పేర్కొన్నారు. 

మరోవైపు తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ శాంతి స్థాపనకు చైనా, భారత్‌ కీలక పాత్ర పోషించగలవని ఆమె తెలిపారు.  క్రెయిన్‌ వివాద పరిష్కారానికి ఇటలీ మద్దతు ఉంటుందని మెలోని ప్రకటించారు. దేశ జాతీయ సమగ్రతను కాపాడేందుకు రూపొందిచిన నియమాలను పరిరక్షించే లక్ష్యంతో పాటు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వివాద పరిష్కారంలో భారత్‌, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని తాను నమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

‘అంతర్జాతీయ చట్టం నియమాలు ఉల్లంఘిస్తే గందరగోళం, సంక్షోభాన్ని ఎదుర్కొంటాం.. దీర్ఘకాలంలో ఆర్థిక ప్రపంచీకరణ, అంతర్జాతీయ చట్టం నియమాలను ప్రభావితం చేస్తుంది..నేను కూడా నా చైనా మిత్రులకు ఇదే చెప్పాను.. ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరించడంలో చైనా, భారత్ వంటి దేశాలు కీలక పాత్ర పోషించాలని అని భావిస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.