యుద్ధభూమిలో సమస్యకు పరిష్కారం దొరకదు

యుద్ధభూమిలో సమస్యకు పరిష్కారం దొరకదు

* చర్చలతోనే శాంతి స్థాపనకు భారత్‌ మద్దతు

యుద్ధ భూమిలో సమస్యకు పరిష్కారాలు లభించవనే విషయాన్ని భారత్ బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తూ, ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత పునరుద్ధరణకు అన్ని విధాలా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలో పలు చోట్ల ఉద్రిక్తతలు ఉన్నాయి.

ఉక్రెయిన్, రష్యా మధ్య పోరు సాగుతోంది. మరో వైపు మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, గాజాస్ట్రిప్‌లో నరమేధం వంటి పలు హింసాత్మక సంఘటనలు దేనికి సంకేతం అని ప్రశ్నించారు. రగిలే వివాదాలను పరస్పర సంప్రదింపులు, సామరస్యంతో పరిష్కరించుకోవల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌ కంటే ముందు పోలండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భేటీ తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

‘ఉక్రెయిన్‌, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలు మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించేవి. యుద్ధక్షేత్రంలో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదని భారత్‌ బలంగా విశ్వసిస్తోంది. ఏ సంక్షోభంలోనైనా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం యావత్ మానవాళికే అతి పెద్ద సవాల్గా మారింది’ అని తెలిపారు.  `సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరత నెలకొనడానికి మేము దౌత్యాన్ని, చర్చలను సమర్థిస్తాం. అందుకోసం భారత్ తన మిత్రదేశాలతో కలిసి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉంది’ అని ప్రధాని మోదీ చెప్పారు.  

విదేశీ పర్యటనలో భాగంగా పోలండ్ వెళ్లిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చించామని, తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. 

ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ సమయంలో ఐక్యరాజ్యసమితి, ఇతర ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు అవసరమని భారత్‌, పోలండ్ భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత విద్యార్థుల తరలింపునకు పోలండ్‌ ఎంతో సహకరించిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. 

భేటీలో భాగంగా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని పెంపొందించే విషయాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా సామాజిక భద్రతా ఒప్పందానికి మేము అంగీకరించడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. రెండు దేశాల భాగస్వామ్యంలో ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనదని పోలండ్ ప్రధాని టస్క్‌ తెలిపారు.

45 ఏళ్ల అనంతరం భారత ప్రధానిని వార్సాలో చూడటం సంతోషంగా ఉందని, ఈ పర్యటన ఇరుదేశాల భాగస్వామ్యానికి సరికొత్త ఊపునిస్తుంది అని చెప్పారు.  ఇక రెండు రోజుల పోలండ్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఉక్రెయిన్కు వెళ్లనున్నారు. పోలండ్‌ నుంచి రైలులో బయలుదేరి 10 గంటల ప్రయాణం అనంతరం మోదీ ఉక్రెయిన్‌కు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అవుతారు.

తాను ఉక్రెయిన్‌కు ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఆహ్వానంపై వెళ్లుతున్నానని, పలు విషయాలపై చర్చలు ఉంటాయని మోదీ  తెలిపారు. ఉక్రెయిన్‌లో తాను ప్రధానంగా అక్కడి ఘర్షణకు శాంతియుత పరిష్కారం దిశలో తన అభిప్రాయాలను ఆయనతో పంచుకుంటానని చెప్పారు. ఆరు వారాల క్రితం రష్యాలో కీలక పర్యటన జరిపిన మోదీ  ఇప్పుడు ఉక్రెయిన్‌కు వెళ్లుతున్నారు. మోదీ  అప్పటి రష్యా పర్యటనపై అమెరికా ఇతర మిత్రదేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.