అమరావతికి రూ 15,000 కోట్ల రుణంకు ప్రపంచ బ్యాంకు, ఎడిబి సిద్ధం

అమరావతికి రూ 15,000 కోట్ల రుణంకు ప్రపంచ బ్యాంకు, ఎడిబి సిద్ధం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించిన మేరకు రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి విడతలోనే రూ.15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ)తో కలసి మంజూరు చేయనుంది. దీంతో పాటు భవిష్యత్తులో మరింత ఆర్థికసాయం అందించే అంశంపైనా చర్చిస్తున్నట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ప్రపంచబ్యాంకు, ఏడీబీలకు చెందిన ప్రతినిధుల బృందం ఆగస్టు 19 నుంచి 27 వరకు రాజధానిలో విస్తృతంగా పర్యటించనుంది.  రుణ మంజూరుకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ అధికారులతో చర్చించనుంది. ఇటీవల అమరావతిలో పర్యటించిన నలుగురు సభ్యుల ప్రపంచ బ్యాంకు బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపింది. 
 
వాస్తవానికి 2019కి ముందే రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వడానికి సిద్దమైంది. ఏఐఐబీతో కలిసి తొలి విడతలో రూ.3,500 కోట్లు రుణం ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఇందుకు అవసరమైన ప్రక్రియ సైతం పూర్తయ్యింది. అయితే ఇంతలో ప్రభుత్వం మారడం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రుణం పట్ల అనాసక్తి వ్యక్తం చేయడంతో కార్యరూపం దాల్చలేదు.
ఇప్పటికే పక్రియ పూర్తవడంతో సత్వరం రుణం మంజూరుకు ప్రపంచ బ్యాంకు, ఏడిబిలకు అవకాశం ఏర్పడుతుంది. రాజధానిలో ప్రాజెక్టుల వారీగా ఎంత మేర రుణం ఇవ్వగలుగుతామన్నది ప్రపంచ బ్యాంకు ఏడీబీ ప్రతినిధుల బృందం నిర్ణయించనుంది. దీంతో ఆ బృందానికి సవివర నివేదికలను అందించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌ భాస్కర్‌ కొద్ది రోజులుగా వివిధ శాఖల అధికారులతో కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
అమరావతిలో శాశ్వత ప్రభుత్వ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మించే సచివాలయ టవర్లు, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌, ఎన్‌జీఓ, సెక్రటరీలు, జడ్జీల భవనాలు, ప్రభుత్వ టైప్‌ – 1, టైప్‌ – 2 భవనాలు, ఎల్‌పీఎస్‌ ఇన్ర్ఫా, ట్రంక్‌ ఇన్ర్ఫా, రాజధాని సంబంధిత ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్ర సమాచారాన్ని ఆయా విభాగాలు సిద్ధం చేసేలా నిర్దేశించారు.