ఇస్రో ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రయోగం విజయవంతం

ఇస్రో ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను‌ నింగిలోకి పంపింది.  ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్ ప్రకటించారు. ఈ మేరకు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 17 నిమిషాలపాటు ప్రయోగం కొనసాగింది.
 
షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.  చిన్న చిన్న శాటిలైట్లను అభివృద్ధి చేయటం, అందుకు అనుకూలమైన పేలోడ్‌ పరికరాలను రూపొందించే లక్ష్యంలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 
 
‘ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌’ ఈవోఎస్‌-08ను తక్కువ ఎత్తులోని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఈ మిషన్‌ లక్ష్యం.  పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలను ఈవోఎస్‌-08 పర్యవేక్షించనుంది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది. 
 
ఇస్రోకు చెందిన యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో ఈవోఎస్‌ను అభివృద్ధి చేశారు. దాదాపు 6 నెలల తర్వాత ఇస్రో చేపడుతున్న రాకెట్‌ ప్రయోగమిది. కేవలం రెండు రోజుల ప్రణాళికతో చిన్న చిన్న శాటిలైట్స్‌ను తక్కువ ఖర్చుతో భూ కక్ష్యలోకి చేర్చేందుకు ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ3 రాకెట్‌తో సాధ్యమవుతుందని ఇస్రో మాజీ సైంటిస్టు ఒకరు చెప్పారు.

ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.  ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ (ఈవోఐఆర్‌) పెలోడ్‌ మిడ్‌-వేవ్‌, లాంగ్‌ వేవ్‌ ఇన్‌ఫ్రా-రెడ్‌లో చిత్రాలను క్యప్చర్‌ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుందని ఇస్రో పేర్కొంది.

ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. భారతదేశ అంతరిక్ష నైపుణ్య కీర్తి మరోసారి సత్తా చాటిందన్న సీఎం, ఇస్రో బృందం భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.