రేవంత్‌ సర్కార్‌కు అమరరాజా బ్యాటరీ నుంచి చుక్కెదురు

రేవంత్‌ సర్కార్‌కు అమరరాజా బ్యాటరీ నుంచి చుక్కెదురు
విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి రాష్ట్ర పారిశ్రామిక దిగ్గజాలలో ఒకటైన అమర రాజా బ్యాటరీస్‌ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలతోనే తెలంగాణలో సెల్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, కానీ ఈ హామీలను కాంగ్రెస్‌ సర్కార్‌ పెడచెవిన పెడితే మాత్రం ప్లాంట్‌ విస్తరణ ప్రణాళికను నిలిపివేస్తామని అమర రాజా బ్యాటరీ అండ్‌ మొబిలిటీ చైర్మన్‌ జయదేవ్‌ గల్లా హెచ్చరికలు జారీ చేశారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీతోనే ఇక్కడ రూ.9,500 కోట్ల పెట్టుబడితో బ్యాటరీ, సెల్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చామని, ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రస్తుత సర్కార్‌ కొనసాగిస్తదని అనుకుంటానని తెలిపారు. కానీ వీటిని కొనసాగించకపోతే మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన బ్యాటరీ తయారీ ప్లాంట్‌ విస్తరణ ప్రణాళికను నిలిపివేయాలనుకుంటున్నట్లు ఆయన స్పష్టంచేశారు. 

దీంతో విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థల చుట్టు తిరుగుతున్న రేవంత్‌ రెడ్డికి తన సొంత ఇలాకాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న సంస్థ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులను గమనిస్తుంటే తనకు ఇటువంటి అనుమానం కలుగుతుందని ఆయన చెప్పడం గమనార్హం. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం వద్ద అవసరమైన నిధులు ఉన్నాయా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దివిటిపల్లి వద్ద అమర రాజా గ్రూపు ఏర్పాటు చేయతలపెట్టిన సెల్‌ తయారీ యూనిట్‌తోపాటు బ్యాటరీ ప్లాంట్‌ తొలి దశ యూనిట్‌కు శనివారం భూమిపూజ చేసింది. అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌ అనుబంధ సంస్థయైన అమర రాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీ(ఏఆర్‌ఏసీటీ) ఈ యూనిట్‌ను పియాజియోతో కలిసి నెలకొల్పబోతున్నది.

అలాగే గత రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ యూనిట్‌లోనే రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌తోపాటు 16 గిగావాట్ల లిథియం-అయాన్‌ బ్యాటరీ గ్రీన్‌ఫిల్డ్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నది. తొలి విడుతలో భాగంగా 8-10 గిగావాట్ల బ్యాటరీ ప్లాంట్‌కు అయ్యే ఖర్చును కంపెనీ అంతర్గత వనరుల ద్వారా సేకరిస్తున్నట్లు, ఒకవేళ అవసరమైతే ఈక్విటీలను జారీ చేయడం ద్వారా నిధులను సేకరించాలనుకుంటున్నట్లు జయదేవ్‌ గల్లా తెలిపారు