పరిగి కొనుగోలు కేంద్రంలో “రైతు గోస – బీజేపీ భరోసా” యాత్ర

పరిగి కొనుగోలు కేంద్రంలో “రైతు గోస – బీజేపీ భరోసా” యాత్ర
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన “రైతు గోస – బీజేపీ భరోసా” యాత్ర సోమవారం పరిగిలో కొనసాగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలోని బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పరిగి వ్యవసాయ కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా సందర్శించింది. అక్కడ ఉన్న రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను, ఆవేదనను అడిగి తెలుసుకుంది.

ఈ కార్యక్రమంలో బిజెఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి చైర్మన్ ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర కల్పించడంలో, సమయానికి కొనుగోళ్లు పూర్తి చేయడంలో, ఐకేపీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని రాంచందర్ రావు మండిపడ్డారు. తాము పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి కళ్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించాల్సి వస్తోందని, అధికారులు, మిల్లు యజమానుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు బిజెపి నాయకుల ప్రతినిధి బృందంతో చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.

రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, రైతాంగ సమస్యల పరిష్కారానికి, ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని  రాంచందర్ రావు రైతులకు భరోసా కల్పించారు. అయితే బీజేపీ బృందం పర్యటిస్తుందనే సమాచారంతో నిన్న రాత్రికి రాత్రే ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడి రైతులను బెదిరించి, సంచులను నింపి, ఎట్లా పడితే అట్లా మిల్లర్ల వద్దకు తరలించిందని రామచందర్ రావు ధ్వజమెత్తారు.

ఇంకా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరపకుండానే, అధికారులు ధాన్యం కొనుగోలు చేసేశామంటూ అబద్ధాలు చెప్పడం దారుణం అని విమర్శించారు.  ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకే ట్రాక్టర్లలో గోనె సంచులు తీసుకొచ్చి రైతుల ధాన్యాన్ని నింపి మిల్లర్లకు తరలించామని రైతులే స్వయంగా మాకు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
కేవలం బీజేపీ నాయకుల బృందం వస్తోందనే భయంతోనే, ప్రభుత్వ యంత్రాంగం కళ్లుగప్పేలా కొనుగోలు ప్రక్రియ జరుగుతున్నట్లుగా ఇక్కడ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలని, రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా, తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం ధాన్యానికి మౌలిక వసతులు కల్పించి, వేగంగా కొనుగోళ్లు జరపాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.