వక్ఫ్ బిల్లుపై 21 మంది ఎంపీలతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ

వక్ఫ్ బిల్లుపై 21 మంది ఎంపీలతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ

వక్ఫ్ బిల్లును ఆగస్టు 8న లోక్‌సభలో రిజిజు ప్రవేశపెట్టగా తీవ్ర చర్చ తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దానిని పంపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వక్ఫ్ (సవరణ) బిల్లు 2024ను పరిశీలించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ కి 21 మంది లోక్‌సభ ఎంపీల పేర్లను ప్రతిపాదించారు. అలాగే 10 మంది సభ్యుల పేర్లను సిఫారసు చేయాలని రాజ్యసభను కోరారు. ఈ ప్రతిపాదనను సభ ఆమోదించింది.

దిగువ సభకు చెందిన 21 మంది ఎంపీలు జెపిసి సభ్యులుగా ఉంటారు. వారు:  జగదాంబిక పాల్, నిషికాంత్ దూబే, తేజస్వి సూర్య, అపరాజిత సారంగి, సంజయ్ జైస్వాల్, దిలీప్ సైకియా, అభిజిత్ గంగోపాధ్యాయ, డికె.అరుణ, గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, మహ్మద్ జావూద్ , మౌలానా మొహిబుల్లా నద్వీ, కళ్యాణ్ బెనర్జీ, ఎ.రాజా, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, దిలేశ్వర్ కమైత్, అరవింద్ సావంత్, సురేశ్ గోపీనాథ్, నరేశ్ గణపత్ మ్హాస్కే, అరుణ్ భారతి , అసదుద్దీన్ ఒవైసీ.

కాగా, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇక ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా నీట్‌ లీకేజీ వ్యవహారం, రైల్వే భద్రత తదితర అంశాలు ఉభయ సభలను కుదిపేశాయి.
 
పార్లమెంట్‌ సమావేశాలు గత నెల 22 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు 2023-24 ఆర్థికసర్వేను ఆర్థిక మంత్రి లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. ‘భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉంది’ అని ఈ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ఆ తర్వాత 23వ తేదీన  2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్డీయే కూటమి ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 
 
ఈ బడ్జెట్‌పై ఉభయ సభల్లో వాడీవేడిగా చర్చ కొనసాగింది. చర్చ అనంతరం కేంద్ర బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపింది. ఇక ఈ సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ముందే ప్రకటించినప్పటికీ ఉభయ సభలు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి.