హైకోర్టులో జడ్ ప్లస్ సెక్యూరిటీ కోరిన జగన్

హైకోర్టులో జడ్ ప్లస్ సెక్యూరిటీ కోరిన జగన్
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉన్న భద్రతను ఇప్పుడు కూడా కొనసాగించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం తనకు ఉన్న జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కుదించిందని సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు.
 
కేంద్ర హోంశాఖ తనకు జడ్ ప్లస్ భద్రత కల్పించిందని, ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు 2024 జూన్ 3న తనకు ఏ విధమైన భద్రత ఉందో దాన్ని పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించాలని పిటిషన్‌లో జగన్ కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, రాష్ట్రస్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పిటిషన్‌లో 2019లో తనపై దాడి జరిగిందని, సీఎం కాకముందే ఉన్నత స్థాయి భద్రత కల్పించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 139 మందితో భద్రత కల్పించారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముందస్తు సమాచారం లేకుండా సెక్యూరిటీని గణనీయంగా తగ్గించారని పేర్కొన్నారు. ప్రస్తుతం భద్రతా విధుల్లో 59 మంది ఉన్నారని తెలిపారు.

కూటమి ప్రభుత్వం తనను అంతం చేయాలని చూస్తోందని జగన్ ఆరోపించారు. జడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు కల్పించిన పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు, కౌంటర్‌ అసాల్ట్‌ టీములు, జామర్‌ను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో జగన్ విజ్ఞప్తి చేశారు.

పోలీసులు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ప్రయాణానికి అనుకూలంగా లేదని, అందులో ఏసీ పనిచేయడం లేదని తెలిపారు. వాహనం లేకపోవడంతో ఓ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకోవలసి వచ్చిందన్నారు. జగన్ కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి.  సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రత మాత్రమే తగ్గించామని పోలీసు శాఖ వెల్లడించింది. అయితే, సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తెలిపారు.  ముఖ్యమంత్రిగా దేశంలో మరే ముఖ్యమంత్రికి లేనంతగా భారీ భద్రతను 934 మందితో జగన్ కు కల్పించారు. 

అత్యాధునిక రక్షణ పరికరాలు, నివాసం చుట్టూ 30అడుగుల ఎత్తున ఇనుప గోడకంచె, బుల్లెట్‌ ప్రూఫ్‌ క్రూయిజర్‌ వాహనాలు.. మూడు షిఫ్టుల్లో 986 మంది భద్రతా సిబ్బంది. సాధారణంగా వీఐపీ భద్రతా సిబ్బంది 100 మందికి మించి ఉండరు. దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ యాక్ట్‌ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చారు. 

కమాండో తరహాలో స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ ఏర్పాటు చేశారు.  కానీ, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్షనేత హోదా కూడా లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా లేని స్థాయిలో రక్షణ కల్పిస్తున్నారు.