ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్గీకరణను సమర్థిస్తూ.. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని స్పష్టత ఇచ్చింది. గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీల్లోని వెనకబడిన కులాలకు లబ్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని గురువారం కీలక తీర్పునిచ్చింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే విభేదించగా మిగిలిన ఆరుగురు ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్ చంద్ర మిశ్రా సభ్యులుగా ఉన్నారు. వీరు ఈ కేసులో 6 తీర్పులను విడివిడిగా ఇచ్చారు.
ఉపవర్గీకరణకు అనుకూలంగా జస్టిస్ మిశ్రాకు, తనకు కలిపి సీజేఐ ఒక తీర్పు రాశారు. మిగిలిన నలుగురు ఇదే వైఖరితో నాలుగు తీర్పులు విడివిడిగా ఇచ్చారు. వీరిలో ఒకరైన జస్టిస్ బీఆర్ గవై- కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్ను గుర్తించి, వారిని రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాలని సూచించారు.
జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. మెజారిటీ తీర్పుతో తాను విభేదిస్తున్నానని, రాజ్యాంగంలోని 341వ అధికరణ కింద నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఎస్సి, ఎస్టీ, ఓబిసి వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అప్పుడే ప్రభుత్వాలు సరైన పథకాలు రూపొందించగలవని తెలిపింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న కల ఉపవర్గీకరణ ద్వారా సాకారం అవుతుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు తీసుకురావడం వెనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే కోటా హేతుబద్ధీకరణ చాలా ముఖ్యమని వివరించారు.
గతంలో వాల్మీకీలు, మఝూబీ సిక్కులకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. పంజాబ్ ప్రభుత్వం నిబంధన తెచ్చింది. అయితే దీనిని పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో కొట్టేసింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. చాలా మంది వ్యతిరేకించారు. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధంగా ఉందని 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పును చెప్పింది. అయితే ఈ తీర్పు ఆధారంగా పంజాబ్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది.
హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. దీనిపై 2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టి.. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. తాజాగా కీలక తీర్పును సుప్రీం కోర్టు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమేనని చెప్పింది. ఎస్సీ, ఎస్టీల్లోని వెనకబడిన కులాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది.
More Stories
సైఫ్ అలీ ఖాన్పై దాడిలో అండర్వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు