విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్‌ స్టికర్‌ లేని వాహనాలకు రెట్టింపు టోల్

విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్‌ స్టికర్‌ లేని వాహనాలకు రెట్టింపు టోల్
నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కఠిన నిర్ణయం తీసుకున్నది. పలువురు వాహనదారులు ఉద్దేశపూర్వకంగా కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్‌లను వాహనం విండ్‌షీల్డ్‌పై ఏర్పాటు చేయకపోవడంతో టోల్‌గేట్ల వద్ద చెల్లింపుల విషయంలో ఇబ్బందులతో పాటు అంతరాయం కలుగుతున్నది. ఈ క్రమంలో కొత్తగా గురువారం సంపూర్ణ మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
ఇకపై విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్‌ స్టికర్‌ ఏర్పాటు చేయకుండా టోల్‌లైన్‌లోకి ప్రవేశించే వాహనదారుల నుంచి డబుల్‌ టోల్‌ వసూలు చేయాలని నిర్ణయించింది. విండ్‌స్క్రీన్‌పై ఉద్దేశపూర్వకంగా ఫాస్ట్‌ట్యాగ్‌ను ఇన్‌స్టాల్ చేయకపోవడంతో టోల్ ప్లాజాల వద్ద అనవసరమైన జాప్యాలు జరుగుతున్నాయని, దాంతో ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.

ఈ మేరకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలంటూ అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలు, రాయితీదారులకు వివరణాత్మకంగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ పొడ్యూసర్‌ ని జారీ చేసింది. దీంతో ఫాస్టాగ్‌లను అమర్చని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి రానున్నది. విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ లేకుండా టోల్‌లేన్‌లోకి ప్రవేశిస్తే విధించే ఛార్జీలపై ఫీజులతో కూడిన బోర్డులు ప్రదర్శించాలని ఆదేశించింది. 

ఫాస్టాగ్‌లు లేని వాహనాల వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సీసీటీవీ ఫుటేజీని సైతం రికార్డు చేయాలని సూచించింది. తద్వారా వాహనాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించవచ్చని పేర్కొంది. 

స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం.. ఫాస్టాగ్‌లను ఏర్పాటు చేసుకోకపోతే లావాదేవీల నిర్వహణకు అర్హత ఉండదని, అలాంటి వారు రెట్టింపు టోల్ రుసుమును చెల్లించాల్సి ఉంటుందని, వారిని బ్లాక్‌లిస్ట్‌ చేర్చవచ్చని తెలిపింది. వివిధ పాయింట్ల నుంచి జారీ చేసే సమయంలో వాహనం విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్‌ ఇన్‌స్టాల్‌ చేసినట్లుగా నిర్ధారించుకోవాలని ఆయా బ్యాంకులను సైతం ఆదేశించినట్లు పేర్కొంది.

 ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న వెయ్యి టోల్ ప్లాజాల వద్ద సుమారు 45వేల కి.మీ జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో వాహనదారుల నుంచి టోల్‌ వసూలు చేస్తున్నారు. 8కోట్ల మంది నుంచి టోల్‌ వసూలవుతుంది. ఫాస్టాగ్‌ దేశంలో ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.