ముంబైలో వర్ష బీభత్సం.. స్తంభించిన జనజీవనం

ముంబైలో వర్ష బీభత్సం.. స్తంభించిన జనజీవనం
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న జోరు వాన ముంబయి మహానగరాన్ని ముంచెత్తింది. రోడ్లు, రైల్వే మార్గాలు జలమయమయ్యాయి. ఫలితంగా లోకల్‌ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
 
ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో 300మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మిమి, పోవాయ్‌లో 314 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు తెలిపారు.
 
సోమవారం తెల్లవారుజామున 1 గంటకు మొదలైన వాన ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. కేవలం ఏడు గంటల వ్యవధిలోనే సుమారు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరం మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైక్‌లు నీటపై తేలాడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా నీరు చేరింది. దీంతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది.
 
వర్షం కారణంగా సెంట్రల్‌ రైల్వే సబర్బన్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు మునిగిపోవడం వల్ల చాలా లోకల్‌ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా ఆర్టీసీ బస్సులను కూడా అధికారులు నిలిపివేశారు.

రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అధికారులకు సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు. 

భారీ వర్షాల నేపథ్యంలో బీచ్‌ల దగ్గరకు ఎవరినీ అనుమతించొద్దని పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, భారీ వర్షం కారణంగా రైళ్లు, విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. వానల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. 

భారీ వర్షాలతో తక్కువ దృశ్యమానత కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యాహ్నం 2.22 నుంచి 3.40 గంటల వరకు రన్‌వే కార్యకలాపాలను నిలిపివేసింది. దాంతో 50పైగా విమానాలను రద్దు చేయడంతో పాటు ఆయా విమానాలను అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ఇండోర్‌కు మళ్లించారు.

వరద పరిస్థితిని సమీక్షించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ముంబయి గార్డియన్ మంత్రి ఎంపీ లోధా, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మంత్రి అనిల్ పాటిల్ సైతం హాజరయ్యారు. సమావేశంలో సీఎం షిండే మాట్లాడుతూ నిన్న రాత్రి నుంచి ముంబయిలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షం నీటిని తోడేందుకు 200 నీటి పంపులు, 400 బీఎంసీ పంపులు పని చేశాయని.. సెంట్రల్‌, హార్బర్‌ లైన్లలో రైళ్లు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు.

ఈ వర్షాలు కారణంగా ముంబయులోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంధేరి, కుర్లా, భందూప్‌, కింగ్స్‌ సర్కిల్‌, దాదర్‌తోపాటు పలు ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. రహదారులపై మోకాలి లోతు నీరు రావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో కార్లు, మోటారు సైకిళ్లు నీళ్లలో మునిగిపోయాయి. ఎన్​డీఆర్ఎ​ఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ముంబయితో పాటు ఠాణె, పాల్ఘర్‌, కొంకణ్‌ బెల్ట్‌కు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.