
తనిఖీలు పూర్తయ్యేవరకు ఎగుమతులు నిలిపివేయాలని పోర్టు అధికారులను మంత్రి ఆదేశించారు. కాకినాడ జిల్లాలో రెండు రోజులు పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్, యాంకరేజి పోర్టులో గోదాములు, బార్జిల్లో బియ్యం తరలిస్తున్న లంగరు రేవు పరిశీలించారు. మొత్తం 12,915 మెట్రిక్ టన్నుల నిల్వలు సీజ్ చేశామని వెల్లడించారు. గోదాముల యజమానులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. యాంకరేజ్ పోర్టు అధికారులపైనా విచారణ చేయిస్తామని మంత్రి హెచ్చరించారు.
పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు ప్రభుత్వం కేజీ బియ్యం రూపాయికే అందిస్తోంది. ఈ బియ్యం సేకరణకు ప్రభుత్వానికి దాదాపు 40 రూపాయల వరకు ఖర్చవుతుంది. అయితే అక్రమార్కులు ఈ బియ్యాన్ని వారికి చేరకుండానే తస్కరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఈ దందా పెద్దఎత్తున సాగుతోంది. సొంతంగా నౌకలు ఏర్పాటు చేసుకుని విదేశాలకు బియ్యం తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమంగా ఆర్జిస్తున్నారో తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దందా సాగినట్లు ఆరోపణలు చెలరేగాయి. అధికారులు సీజ్ చేసిన గోదాములు, బియ్యం నిల్వలన్నీ ద్వారంపూడి చంద్రశేఖర్ అనుచరులవే కావడంతో అన్ని వేళ్లూ ఆయనవైపే చూపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నెలకు 2.12 లక్షల టన్నులు రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంటే, అందులో సగం మాఫియా సేకరిస్తోంది. అర్హతలేని వారికి రేషన్ కార్డులు ఇవ్వడం, కొందరు ఈ బియ్యం తినడానికి ఇష్టపడకపోవడం వల్ల రేషన్ బియ్యం మాఫియాకు కలిసొచ్చింది. ఊరూరా దళారులను నియమించుకుని కిలోకు 8 నుంచి 10 రూపాయల చొప్పున చెల్లించి రేషన్ బియ్యం సేకరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు నుంచి సేకరించిన బియ్యాన్ని మచిలీపట్నం, కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. పోర్టులో లోడింగ్, అన్లోడింగ్ కోసం బిహార్, ఒడిశా కూలీలను పెట్టుకున్నారు. గతంలో కాకినాడ యాంకరేజ్ పోర్టు ద్వారానే ఎగుమతి చేసేవారు. ఇప్పుడు ప్రైవేట్ పోర్టు ద్వారా ఎగుమతుల సామార్థ్యం పెంచి, అదనపు బెర్తుల నిర్మాణానికి అవకాశం ఇచ్చి స్వలాభానికి వాడుకుంటున్నారు.
More Stories
పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో ఢిల్లీలో విజయం
అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది
అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు