ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో నకిలీ నోట్ల ముద్రిస్తున్న నక్సల్స్‌

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో నకిలీ నోట్ల ముద్రిస్తున్న నక్సల్స్‌
ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో భద్రతా దళాలు ఆదివారం చేపట్టిన జాయింట్‌ ఆపరేషన్‌లో మావోయిస్టుల స్థావరంలో ఆయుధాలతోపాటు దొంగనోట్ల ముద్రణ సామగ్రి దొరకడం సంచలనంగా మారింది. జాయింట్‌ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు సుక్మా జిల్లాలోని కొరాజ్‌గూడ అడవుల్లో మావోయిస్టుల స్థావరంపై దాడులు చేశారు. 
 
అక్కడ నకిలీ నోట్ల పేపర్లు, వాటి తయారీ యంత్రాలు (కలర్‌ జిరాక్స్‌, స్కానర్స్‌), ఇన్వర్టర్‌, క్యాట్రిడ్జులు, ద్రవ రసాయనాలు లభించాయి. రెండు తుపాకులు, వాకీ టాకీలు, విప్లవ సాహిత్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎన్నడూ లేనివిధంగా మావోయిస్టులు నకిలీ నోట్ల ముద్రణకు పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
 
కాగా, చత్తీస్‌గఢ్‌లోనే సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురి గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయిపూర్‌కు 400 పైగా కిలో మీటర్ల దూరంలో భద్రత దళాల సిల్గేర్, టెకల్‌గూడెమ్ శిబిరాల మధ్య తిమ్మాపురం గ్రామం సమీపాన ఆదివారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు నక్సల్ ఐఇడి పేల్చారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. మృతిచెందిన జవాన్లు విష్ణు, శైలేందర్‌ అని పోలీసులు తెలిపారు. 
 
మరోవైపు, మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మోస్ట్‌ వాంటెడ్‌ నాయకుడు గిరిధర్‌ తుమ్రెట్టి అలియాస్‌ బిచ్చు తన భార్య సంగీత అలియాస్‌ లలితతో కలిసి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోయారు.