ఇటలీ పార్లమెంట్‌లో కొట్టుకున్న ఎంపీలు

ఇటలీ పార్లమెంట్‌లో కొట్టుకున్న ఎంపీలు
జీ7 శిఖరాగ్ర సదస్సు వేళ ఇటలీ పార్లమెంట్‌లో ఉద్రిక్త పరిస్థితి వెలుగుచూసింది. ఓ బిల్లు విషయంలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ప్రతిపక్ష నేతకు ఒకరికి గాయాలైనట్లు తెలుస్తోంది. సదరు సభ్యుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది. ప్రజల నుంచి సేకరించిన పన్నుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛను ఇచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. దీన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ లియోనార్డో డోనో పార్లమెంట్‌లో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించే ప్రయత్నించారు.

ఈ క్రమంలో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చట్ట సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని కొట్టుకున్నారు. సభలో గందరగోళానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. డోన్నో ఉద్దేశం రోమ్‌ నుండి మరింత స్వయంప్రతిపత్తిని కోరుకునే ప్రాంతాలకు మంజూరు చేసే ప్రణాళికలను ఖండించడానికి ఉద్దేశించబడిందని, ఇది ఇటలీ ఐక్యతను దెబ్బతీస్తుందని విమర్శకులు వాదించారు.

కాగా, ప్రస్తుతం ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు అగ్రరాజ్యం అమెరికా సహా వివిధ దేశాధినేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఇలాంటి సమయంలో నేతలు ఇలా విచక్షణ కోల్పోయి, హుందాతనం మరిచి పరస్పరం దాడులకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ ఘటన ఇటలీ ఐక్యతను దెబ్బతీస్తుందని స్థానిక నేతలు వ్యాఖ్యానించారు. కాగా, ఇక గురువారం నుంచి శనివారం వరకూ జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో యూరోపియన్ యూనియన్, మరో ఆరు దేశాల నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశాల కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు.