ఉక్రెయిన్‌కు రష్యా ఆస్తుల వడ్డీ నుంచి రూ.4లక్షల కోట్లు

ఉక్రెయిన్‌కు రష్యా ఆస్తుల వడ్డీ నుంచి రూ.4లక్షల కోట్లు

రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి రూ.4.17 లక్షల కోట్ల (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీ అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని తీర్మానించాయి. 

ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన వేళ గురువారం ఈ మేరకు కీలక పరిణామం జరిగింది. రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో దాదాపు రూ.21.72 లక్షల కోట్ల విలువైన ఆ దేశ ఆస్తులు స్తంభింపజేసి ఉన్నాయి. వాటిలో అత్యధికం ఐరోపా దేశాల్లోనివే.

సాంకేతికంగా, చట్టపరంగా సమస్యలు తలెత్తకుండా ఈ ఆస్తుల నుంచి నిధులు ఎలా సమకూర్చాలన్నదానిపై జీ7 దేశాలు విస్తృతంగా సమాలోచనలు జరపనున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి భారీ విధ్వంసం సృష్టించినందుకు రష్యా పరిహారం చెల్లించేదాకా, ప్రస్తుతం స్తంభింపజేసిన ఆ దేశ ఆస్తులపై ఆంక్షలను తొలగించకూడదనీ అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి.

తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులు ఈ ఏడాదే ఉక్రెయిన్‌కు అందనున్నాయి. శుక్రవారం దీనిపై సంయుక్త ప్రకటన వెలువడనుంది. జీ7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్యదేశాలు. ఉక్రెయిన్‌కు సైనికేతర సాయం కింద తాము సొంతంగా 31 కోట్ల డాలర్లు అందజేయనున్నట్లు బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ తాజాగా ప్రకటించారు.

కాగా, పోప్ ఫ్రాన్సిస్ జి 7 శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించిన మొదటి పోప్ అవుతారు.  ఆయన కృత్రిమ మేధస్సు , వాగ్దానాలు, ప్రమాదాల గురించి శుక్రవారం మాట్లాడనున్నారు, అయితే ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడి,  గాజాలో ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి శాంతియుత ముగింపు కోసం తన విజ్ఞప్తిని కూడా పునరుద్ధరించాలని భావిస్తున్నారు.