మోదీ నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తాం

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ నుంచి కేబినెట్ మంత్రి రామోహననాయుడుకు పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.  బండి సంజయ్ కు హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం హర్షదాయకమని, పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రిగా, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించడం హర్షదాయకమని పేర్కొన్నారు. 
 
ఒకట్రెండు రోజుల్లో అధికారులతో చర్చించిన తర్వాత.. ‘మిషన్ 100 డేస్ అజెండా’తో ముందుకెళ్తామని తెలిపారు. దేశాభివృద్ధిల్లో బొగ్గు పాత్ర కీలకమని, బొగ్గు వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాననే విశ్వాసం తనకుందని చెప్పారు. 
 
ప్రైవేటు రంగంలో చాలా సంస్థలు బొగ్గు గనుల వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్నాయని, వారందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని తెలిపారు. విద్యుదుత్పత్తి, స్టీల్ కంపెనీలకు బొగ్గు అవసరం ఉంటుందని గుర్తు చేశారు. “గనులు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉంటాయి. ఇసుకతో పాటుగా చాలా వరకు ఖనిజాల వెలికితీతపై గనుల శాఖ పర్యవేక్షిస్తుంది. బొగ్గు, గనుల శాఖలు.. దేశానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలు. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయాలు పెంచే విషయంలో ప్రత్యేక చొరవతీసుకుంటాం” అని కిషన్ రెడ్డి తెలిపారు. 

2014కు ముందు దేశంలో విద్యుత్ కోతలుండేవని, అయితే నరేంద్ర మోదీ వచ్చాక బొగ్గు ఉత్పత్తి పెంచడం ద్వారా విద్యుత్ కోతల్లేని దేశంగా నిర్మించారని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ దిశగా బొగ్గు కొరత లేకుండా.. మరింత విద్యుదుత్పత్తి పెంచడంపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. 

దేశమంతా విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని చెబుతూ వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగం రంగాల్లో డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. యూపీఏ హయాంలో బొగ్గు రంగంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, అయితే, మోదీ వచ్చాక పారదర్శకమైన విధానాలు తీసుకొచ్చి.. బొగ్గు తవ్వకం, సరఫరా, వినియోగం విషయంలో అవినీతి లేకుండా పనిచేశామని వివరించారు.

ప్రధాని మోదీ  నాయకత్వంలో బొగ్గు, గనుల విషయంలో తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తామంతా కృషిచేస్తామని చెప్పారు.