నీట్‌ యూజీ పరీక్ష ఫలితాలపై అనుమానాలు… గ్రెస్ మార్కుల సమీక్ష!

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్ష ఫలితాలపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019 నుంచి ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, టాపర్లుగా నిలవడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరింది.
 
నీట్ యూజీ 2024 ఫలితాల్లో కొందరికి అనూహ్యంగా ఎక్కువ మార్కులు రావడంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు వ్యక్తమవుతు ఉండడంతో, 1,500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను సమీక్షించడానికి విద్యాశాఖ నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ అధ్యయనం అనంతరం, గ్రేస్ మార్కులు పొందిన ఆ 1500 లకు పైగా ఉన్న విద్యార్థుల ఫలితాలను సవరించే అవకాశం ఉందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం ప్రకటించింది. 
 
యూపీఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలోని కమిటీ వారం రోజుల్లో తన సిఫారసులను సమర్పిస్తుందని, అనంతరం, గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థుల ఫలితాలను సవరించవచ్చని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ తెలిపారు. గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హత ప్రమాణాలపై ప్రభావం పడబోదని, ప్రభావిత అభ్యర్థుల ఫలితాల సమీక్ష అడ్మిషన్ ప్రక్రియపై ప్రభావం చూపదని ఆయన తెలిపారు.
 
ఈనెల 4వ తేదీన నీట్ 2024 ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది 13 లక్షల మందికి పైగా అభ్యర్థులు నీట్ యుజి పరీక్షలో ఉత్తీర్ణులు కాగా, వారిలో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. ఇప్పటివరకు నీట్‌ యూజీలో ఒక్కసారి కూడా ముగ్గురికి మించి టాపర్లు లేరు. 2019, 2020లో ఒక్కొక్కరు చొప్పున టాపర్లుగా నిలిచారు. 2021లో ముగ్గురు, 2022లో ఒక్కరు, 2023లో ఇద్దరు టాప్‌ స్కోరు సాధించారు. 
 
కానీ, ఈసారి అసాధారణ రీతిలో 67 మంది టాపర్లుగా నిలవడం, వీరిలో హర్యానాలో ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన ఆరుగురు  ఉన్నారనే వార్తలు రావడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానాలు మొదలయ్యాయి.  ఎక్కువ మందికి ఇలా అధిక మార్కులు రావడానికి, టాపర్లు కావడానికి ఫిజిక్స్‌లో వచ్చిన ఒక ప్రశ్ననే కారణమని పరీక్ష నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) చెప్తున్నది. 
 
ఈ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నకు ఎన్‌సీఈఆర్‌టీ కొత్త టెస్టుబుక్‌ ప్రకారం ఒక సమాధానం, పాత టెస్టుబుక్‌ ప్రకారం మరో సమాధానం సరైనవి.మొదట ఒక్క సమాధానానికే ఎన్‌టీఏ మార్కులు ఇస్తూ కీ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు రావడంతో రెండు సరైన సమాధానాల్లో ఏది రాసినా మార్కులు వేసినట్టు ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ నిర్ణయంతో 44 మంది అభ్యర్థులకు మార్కులు 715 నుంచి 720కి పెరిగినట్టు వివరించింది. 
 
ఈసారి పరీక్షా పత్రం సులువుగా ఉండటం, గత ఏడాది కంటే దాదాపుగా మూడు లక్షల మంది ఎక్కువగా పరీక్ష రాయడం కూడా టాపర్లు పెరగడానికి కారణమని పేర్కొన్నది. పైగా, చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. 720 మార్కులకు గానూ నీట్ యుజి పరీక్షను పెన్, పేపర్ విధానంలో నిర్వహించారు. 
ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. ఎవరైనా అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం రాస్తే వారికి 720 మార్కులు వస్తాయి. ఎవరైనా ఒక ప్రశ్నను వదిలివేస్తే, 4 మార్కులు తగ్గి 716 మార్కులు వస్తాయి. 
 
ఎవరైనా ఒక ప్రశ్నకు తప్పుగా సమాధానం ఇస్తే అతనికి 4 మార్కులతో పాటు తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గి అంటే మొత్తం 5 మార్కులు తగ్గి 715 మార్కులు వస్తాయి. కానీ ఈసారీ నీట్ యుజి పరీక్షలు కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావడం పట్ల అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  నీట్ పరీక్షలో విద్యార్థులు సమయం కోల్పోవడం వల్ల వారు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే గ్రేస్ మార్కులు ఇచ్చామని వివరించింది. గ్రేస్ మార్కుల వల్ల మాత్రమే ఈ వ్యత్యాసం కనిపిస్తుందని పేర్కొంది. అందుకే 718 లేదా 719 మార్కులు వేయాల్సి వచ్చిందని తెలిపింది.
 
అయితే ఏ ప్రాతిపదికన ఎంత గ్రేస్ మార్క్ ఇచ్చారో మాత్రం ఎన్‌టిఎ స్పష్టత ఇవ్వలేదు. కేవలం కోర్టుకు వెళ్లిన విద్యార్థులకు మాత్రమే గ్రేస్ మార్కులు ఇచ్చారని, మిగతా విద్యార్థులకు గ్రేస్ మార్కులు కేటాయించకపోవడం పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ వివాదంపై తాజాగా ఎన్‌టిఎ వివరణ ఇచ్చింది. కొన్ని కేంద్రాల్లో పరీక్ష నిర్వహణలో జాప్యంపై 1,563 మంది అభ్యర్థులు హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారని, వారికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం గ్రేస్ మార్కులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇలా గ్రేస్ మార్కులు పొందిన వారిలో మైనస్ 20 నుంచి 720 వరకు మార్కులు వచ్చిన విద్యార్థులూ ఉన్నారని తెలిపింది.మరోవంక, నీట్‌ ఫలితాల విషయంలో వివాదం కోర్టులకు చేరింది. నీట్‌ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గ్రేస్‌ మార్కుల కేటాయింపులో తప్పులు జరిగాయని, ఫలితంగా అభ్యర్థులు అడ్మిషన్లు పొందడంలో నష్టపోతారని న్యాయవాది తన్మయ్‌ ఛటోపాధ్యాయ్‌ కోర్టుకు తెలిపారు. దీంతో ఫలితాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై 10 రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎన్‌టీఏను జస్టిస్‌ కౌశీక్‌చంద్ర ఆదేశించారు. 

మరోవైపు రెండు జవాబులు ఉన్న ప్రశ్నకు సమాధానం రాయకుండా వదిలేసిన వారికి కూడా మార్కులు కలపాలని కోరుతూ ఓ అభ్యర్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రెండు జవాబులు సరైనవి కావడంతో ఏ జవాబును రాయకుండా వదిలేశామని, నీట్‌లో ఒక్క మార్కుతోనూ ర్యాంకులో భారీ తేడా వస్తుంది కాబట్టి మార్కులు కలపాలని అభ్యర్థి కోరారు. ఈ పిటిషన్‌పై అభిప్రాయం తెలపాల్సిందిగా ఎన్‌టీఏను వెకేషన్‌ బెంచ్‌ జడ్జి జస్టిస్‌ డీకే శర్మ ఆదేశించారు.

కాగా, నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే డిమాండ్‌ చేశారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో జూదం ఆడుతున్నారని, కచ్చితంగా దీనిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ మరో నేత జైరామ్‌ రమేశ్‌ కోరారు. నీట్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ హర్యానాలోని జింద్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. 

హర్యానాలో ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురికి టాప్‌ ర్యాంకులు వచ్చాయని వీరు పేర్కొన్నారు. నీట్‌ పరీక్ష విధానంలో ఎవరికీ 718, 719 మార్కులు వచ్చే అవకాశం లేదని, కానీ ఫలితాల్లో ఇలా వచ్చాయని తెలిపారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ పలువురు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.