పౌరసరఫరాలలో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి

పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతి బయటపడాలని, కాళేశ్వరం లాగా విచారణ మిగిలిపోవద్దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పష్టం చేశారు. నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు. రైసు మిల్లర్ల నుంచి గతంలో నాయకులకు ముడుపులు ముట్టాయని ఆరోపించారు. కాళేశ్వరం విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని మండిపడ్డారు.  పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

కృష్ణా జలాల విషయంలో నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్న బండి సంజయ్‌ ఎస్ఎల్బీసీ పేరుతో కాంగ్రెస్‌ నేతలు, డిండి పేరుతో బీఆరఎస్ నేతలు మోసం చేశారని ధ్వజమెత్తారు.  590 టీఎంసీలు రావాల్సి ఉంటే కేసీఆర్‌ 290 టీఎంసీలకే ఒప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా నడుస్తోందని బండి సంజయ్ విమర్శించారు.

“బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలకు పాల్పడి వేల కోట్లు దోచుకుందో కాంగ్రెస్ పార్టీ కూడా వేల కోట్లు దోచుకుంటూ దిల్లీకి పంపుతోంది. రాష్ట్రంలో జరిగిన నష్టాలపై విచారణ జరగాలి. దానికి కారకులు ఎవరు, ఏ విధంగా నష్టం జరిగింది. కాళేశ్వరం స్కామ్ తర్వాత పెద్దస్కామ్ అంటే పౌరసరఫరా శాఖలో జరిగింది. విచారణ అంటారు కానీ ఏమీ చేయరు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు” అంటూ ఆయన ధ్వజమెత్తారు. 

“ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అరెస్టులు చేస్తామని చెప్పారు కానీ ఎందుకు చేయడం లేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫర శాఖలో జరిగిన కుంభకోణాలను బయటపెట్టాలి. లేదంటే మీరు విమర్శలకు గురవుతారు.” అని హెచ్చరించారు.

బీజేపీ పోరాటాల ఫలితంగానే కేసీఆర్‌ గద్దె దిగారని బండి సంజయ్ తెలిపారు.  తెలంగాణ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తే హిందువులకు తీవ్ర అన్యాయం జరుగుందని చెప్పారు. ఏ మతానికి తాను వ్యతిరేకం కాదన్న ఆయన హిందూ ధర్మాన్ని ఎదిరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. 

అయోధ్య రామయ్య అక్షింతలను కాంగ్రెస్ హేళన చేసిందని గుర్తుచేశారు. స్కాలర్ షిప్ లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థుల కోసం రూ.11వేల కోట్లు ఖర్చు చేయలేని ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా పాలిస్తుందని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో మరోసారి మోదీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.