తెలంగాణాలో రెండంకెల సీట్లు.. కిషన్ రెడ్డి ధీమా

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రానున్నాయని, దేశమంతా ప్రజాస్వామ్య పండగ జరుపుకుంటామని, తెలంగాణాలో రెండంకెల సీట్లు సాధిస్తామని ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కుంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా మారుతుందని చెబుతూ 2023 ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారంతా.. ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారని స్పష్టం చేశారు.

యువకులు, మహిళలు ఏకమై బీజేపీని ఆదరించారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం కాస్త తగ్గినా పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తమకు సమాచారం వచ్చిందని కిషన్‌ రెడ్డి తెలిపారు.

”2019 పార్లమెంటు ఎన్నికల్లో 62.7శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి పోలింగ్‌ పర్సెంటేజ్‌ 65 శాతం దాటుతుందని తెలుస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పార్టీలకు అతీతంగా.. మోదీకి అండగా నిలిచారు. 2023 ఎన్నికల్లో ఇతర పార్టీలకు వేసిన వారంతా.. ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారు” అని చెప్పారు.

“యువకులు, మహిళలు ఏకమై బీజేపీని ఆదరించారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది. ఓటింగ్‌ తగ్గటానికి చాలా కారణాలున్నాయి. చాలామంది ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు వెళ్లడం, తదితర కారణాలతో ఓటింగ్‌ తగ్గిందని తెలుస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.

”ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడం సంతోషకరం. సహకరించిన అన్ని పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ కుటిల యత్నాలను ప్రజలు పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కార్యకర్తలే వారి మాటలను సీరియస్‌ గా తీసుకోలేదు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా బీజేపీకి అనుకూలంగా ఉందని భావిస్తున్నాను” అని కిషన్ రెడ్డి తెలిపారు.

“మేము ముందుగా చెప్పినట్లుగా.. ఈ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రానున్నాయి. మా పార్టీ అభ్యర్థులపై తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తలు.. వారి నాయకుల మాటలను పట్టించుకో లేదు. బీజేపీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు” అని చెప్పారు. 

“ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ నేతృత్వంలో వివిధ యాత్రలు చేశాం. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, అనంతరం పార్లమెంటు ఎన్నికలకు శ్రమించిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇవాళ జరిగిన పోలింగ్‌తో బీజేపీ తెలంగాణలో కొత్త శక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కేంద్ర పార్టీ అనేక రకాలుగా మాకు సహకరించింది. తెలంగాణ అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో సంపూర్ణ సహకారం లభించింది” అని కేంద్ర మంత్రి వివరించారు.

సికింద్రాబాద్‌లో బీజేపీ విజయం ఖాయం

ఓటింగ్‌ శాతంతో సంబంధం లేకుండా సికింద్రాబాద్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని, అందులో అనుమానం లేదని స్పష్టం చేశారు. అర్బన్‌ ఏరియాలో ఓటర్‌ లిస్టుకు సంబంధించిన సంస్కరణలు జరగాలని కేంద్ర మంత్రి సూచించారు. ఓటర్‌ లిస్టును ప్రభుత్వం వెరిఫికేషన్‌ చేయాలని కోరారు. చనిపోయిన ఓటర్ల పేర్లు ఇచ్చినా తొలగించ లేదని చెప్పారు. 

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో వేల ఓట్లను తొలగించారు. వేల ఓట్లను తొలగింపు జాబితాను ముందు రాత్రే తమకు ఇచ్చారని విస్మయం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా ఈ తొలగింపు జరిగిందని చెబుతూ ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేస్తే బాగుండేదని సూచించారు. 

“మా ఇంట్లో నా ఓటు ఒక దగ్గర, మా బాబు ఓటు మరో దగ్గర ఉంది. రానున్న రోజుల్లో దీనిపై ఆలోచన చేసి చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు. ఈ పండుగను ప్రజాస్వామ్య పండుగలా జరుపుకోవాలని మోదీ చెప్పారని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేశారు. మోదీ  పేరును తెలంగాణాలో నిషేధించారా? అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ నేతల మాటలు అర్థరహితం అని కొట్టిపారవేసారు. ఈ స్థాయికి కాంగ్రెస్‌ పార్టీ దిగజారిందని చెబుతూ రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీకి నేతృత్వం వహించినన్ని రోజులు బీజేపీకి డోకా లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం మజ్లిస్‌ కార్యకర్తలు పని చేశారని  కిషన్‌ రెడ్డి ఆరోపించారు.