పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో పొరపాట్లు.. రిపొలింగ్

ఎపిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు మే 7, 8 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్లు వేసేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రకటించారు. 
 
ఇదిలా ఉండగా  ఈ నెల 5 న చిలకలూరిపేట నియోజకవర్గంలోని, గణపవరం జడ్పీ హైస్కూల్లో జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో పొరపాట్లు జరిగినట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. రీపోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక్కడ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పోస్టల్ బ్యాలెట్ స్థానంలో ఈవీఎం బ్యాలెట్ పేపర్లను ఇచ్చారు. ఉద్యోగులు సైతం వాటిపైనే ఓట్లు వేశారు. 
 
చివర్లో విషయం తెలియడంలో విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో రీపోలింగ్‌కు ఆదేశాలిచ్చింది. మరో రెండ్రోజుల్లో అక్కడ రీపోలింగ్ జరగనుంది.  చిలకలూరిపేట నియోజకవర్గంకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి గణపవరం జిల్లా పరిషత్‌ స్కూలులో ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. పి.వోలు, ఎపివోలకు పోలింగ్ నిర్వహించారు. 
 
మొత్తం 1219 మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్‌ పూర్తయిన తరువాత అధికారులు పొరపాటును గుర్తించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లకు బదులు ఈవిఎంలలో పెట్టే బ్యాలెట్‌లను ఉద్యోగులకు అందచేశారు. ఉద్యోగులు ఈ బ్యాలెట్‌లపై ఓటు వేశారు. 
ఓటింగ్‌ పూర్తయిన తరువాత గుర్తించిన అధికారులు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియ చేశారు.
ఈవ్యవహారంపై ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు నివేదించారు. ఈ విష‌యంపై విప‌క్షాలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ రీపోలింగ్ కు ఆదేశాలిచ్చింది.  ఈ పొరపాటుపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌ అయింది. గణపవరంలో ఐదో తేదీన నమోదైన 1, 219 ఓట్లను ఇన్‌ వాలిడ్‌ గా ప్రకటించింది.
రద్దయిన ఈ ఓట్లను రీపోలింగ్‌ ద్వారా మళ్ళీ నమోదు చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది . పల్నాడు జిల్లాలో జరిగిన ఈ పొరపాటుకు కారణమైన, అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎన్నికల కమిషన్‌ రంగం సిద్ధం చేసింది.