హైదరాబాద్లో అమిత్ షాపై కేసు నమోదు

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై  హైదరాబాద్ సిటీ పరిధిలోని మొఘల్ పురా పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా మే 1వ తేదీన హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో తలపెట్టిన రోఢ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ నేత, పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఈసీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

వీరి ప్రచారంలో చిన్నారులు ఉన్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు.  రోడ్ షో అనంతరం నిర్వహించిన సభలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత మాట్లాడే సమయంలో కొంత మంది చిన్నారులను తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేశారు. దీంతో  చిన్నారులు అమిత్ షా వద్దకు వెళ్లారు. 

అయితే ఆ సమయంలో ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్ మీద కమలం పువ్వు గుర్తు ఉందని ఇద్దరు చిన్నారుల చేతుల్లో ఆప్ కీ బార్ 400 సీట్స్ అంటూ రాసి ఉందని వివరించారు. ఇలా ఎన్నికల్లో చిన్నారులను ప్రచారం కోసం వాడుకోవడం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఈ తరహా ప్రచారం ఎన్నికల కోడ్ కు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం సంఘటన పై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని  ఆదేశించింది. 

సీపీ ఆదేశాలతో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహారా రంగంలోకి దిగి విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. మొఘల్ పురా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఏ1 గా యమాన్ సింగ్, ఏ2గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత, ఏ3 గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏ4గా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, ఏ5 గా బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఉన్నారు.