తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు. ఎన్నికల బరిలో మొత్తం 525 మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు.  తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 13న జరిగే పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.
నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌కు సమయం ఇచ్చారు.
తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. అయితే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తామని  స్పష్టం చేశారు.  పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు పోలింగ్‌ సమయాన్ని పెంచినట్లు ఈసీ తెలిపింది.
 
సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారని తెలిపారు. 285 మంది స్వతంత్రుల అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వివరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానానికి 17 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు చెప్పారు.
 
ఒక్క బ్యాలెట్ యూనిట్‌లో 15 మంది అభ్యర్థులను పెట్టడానికి అవకాశం ఉందని, మూడు బ్యాలెట్ యూనిట్‌లు అవసరం పడేవి 7, రెండు ఉపయోగపడేది -9 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నట్లు చెప్పారు. 1 లక్షా 5 వేల బ్యాలెట్ యూనిట్‌లు అవసరం పడుతున్నాయిని, అదనంగా 35 వేలు ఉంచామని పేర్కొన్నారు. 15,970 సర్వీస్ ఓటర్లు ఉన్నారని, వాళ్ల కోసం ఎలక్ట్రానిక్ మిషన్లు ఉన్నాయని చెప్పారు. మే 3 నుంచి ఈవీఎంల కమిషనింగ్ స్టార్ట్ అవుతుందని, మే 6వ తేదీ వరకు ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు.
 
ఎన్నికల్లో దాదాపు 2 లక్షల 95 వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారని,  60 వేల పోలీస్, 20 వేల ఇతర రాష్ట్రాల దళాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 1950 టోల్ ఫ్రీ, వెబ్ బేస్ , సి – విజిల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. 
 
తొలిసారి ఓటర్లు 9.20 లక్షలుగా వెల్లడించారు. 2 లక్షల 45 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేశారని తెలిపారు. హోం ఓటింగ్ కోసం 24,974 మంది అప్లయ్ చేసుకున్నారని చెప్పారు. హోం ఓటింగ్ అప్లై చేసిన వాళ్లు ఇంటి దగ్గర అందుబాటులో ఉండాలని కోరారు.  ఇక ఇప్పటి వరకు రూ. 81 కోట్ల నగదు, రూ.46 కోట్ల విలువైన లిక్కర్ , రూ.26 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసి 7,185 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.