తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే

తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే లాంటిదని చెబుతూ ఇక్కడ బిజెపి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. బిఆర్‌ఎస్ సర్కారు అవినీతి చేసి ప్రజల సొమ్మును లూటీ చేసిందని మండిపడుతూ మోదీ  నేతృత్వం లో దేశంలో ఒక్క అవినీతి జరగలేదని వెల్లడించారు. 

2027 వరకు ప్రపంచంలోనే భారత్ ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని జరిగిన బిజెపి విజయ సంకల్ప యాత్రలో బిజెపి నేతలు జి. కిషన్‌రెడ్డి, డా. కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్ లతో కలిసి పాల్గొంటూకాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ విధానాలను అవలంబిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. 

భవ్యమైన రామ మందిరం నిర్మించి ప్రాణ ప్రతిష్ట చేశామని, జమ్మూకశ్మీర్ 370 ఆర్టికల్‌ను రద్దు చేశామని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి ముస్లిం సమాజంలోని మహిళలకు విముక్తి కలిగించామని వెల్లడించారు. బీజేపీ రాజనీతి పార్టీనని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజనీతి పార్టీలు కాదని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ ప్రధానులు పేదరికాన్ని పెంచి పోషించారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదరికం నుంచి 15 కోట్ల మందిని బయటకు తీసుకు వచ్చామని, సిఎఎను తీసుకువచ్చామని పేర్కొన్నారు.బిజెపి దేశంలోనే అత్యంత ప్రజాస్వామ్య పార్టీ తెలిపారు.  రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే అక్కడ మన విద్యార్థులు ఉన్నారని, రెండు దేశాలతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి విద్యార్థులను మోదీ తీసుకోవచ్చారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేనంతగా దేశంలో డిజిటల్ లావాదేవీలు  తీసుకువచ్చామని తెలిపారు. 

గతంలో మహిళలకు 33 శాతం రిజ్వరేషన్ ఇస్తామని అన్నారు కానీ కాంగ్రెస్ ఇవ్వలేదని, మోదీ మాత్రమే చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకువచ్చా రని రక్షణ మంత్రి చెప్పారు. దేశం ఇప్పుడు అత్యంత శక్తి వంతమైనదిగా అవతరించిందని పేర్కొన్నారు. రక్షణ వ్యవస్థలో అత్యంత శక్తివంతంగా తయారు అయ్యామని చెప్పారు. 

 కిషన్ రెడ్డి కేంద్రంలో తనతో పాటు పని చేశారని చెబుతూ మీ సమస్యలను మీ ఆలోచనలు కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో వినిపిస్తారని వెల్లడించారు. కిషన్ రెడ్డిని గెలిపించండి అని కోరారు. మల్కాజ్ గిరి అభ్యర్థిగా ఈటెలను గెలిపించాలని కోరుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పని చేశాడని, బిఆర్‌ఎస్ అవినీతిని చూసి బయటకు వచ్చేశాడని కీలక వ్యాఖ్యలు చేశారు.