ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
కాగా, భానుడి భగభగలతో రాష్ట్రమంతా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాలలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బ సోకి ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రాబోయే రోజుల్లో గరిష్ఠంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం, జల్లులు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
More Stories
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్
తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం