16 శాతం తగ్గిన ముడి చమురు దిగుమతుల చెల్లింపులు

దిగుమతుల పరిమాణంలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ.. 2023-24లో భారతదేశం ముడి చమురు దిగుమతి చెల్లింపులు సగటున 16 శాతం తగ్గి,  132.4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.  రష్యా ముడి చమురు సరఫరాపై రాయితీ  ప్రకటించడంతో ఈ మేరకు తగ్గినట్లు పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ ఇటీవలి సమాచారం తెలిపింది.  

గతేడాది ముడి చమురు దిగుమతి చెల్లింపులు  157.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. రష్యా ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, పశ్చిమదేశాల నుండి ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ  భారత్‌కు ముడి చమురును అందించే  ప్రధాన సరఫరాదారుగా రష్యా నిలిచింది.   ఆంక్షలు ప్రారంభమైనప్పటి నుండి ఈ రాయితీలను అందించడం ప్రారంభించింది.  ప్రారంభంలో బ్యారెల్‌కు 30 డాలర్లకు పైగా ఉండగా, ప్రస్తుతం బ్యారెల్‌కు 5- 6డాలర్ల మేర రాయితీ ఉన్నట్లు  విశ్లేషకులు పేర్కొన్నారు.   

రాయితీలు  కొంత మేర తగ్గినా  గతేడాది భారత్‌ 232.7 మిలియన్‌ టన్నుల ముడిచమురును దిగుమతి చేసుకోగా, 2013-  24లో స్వల్పంగా తగ్గి 232.5 మిలియన్‌ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. అయినప్పటికీ అధిక వినియోగం కారణంగా ముడిచమురు కోసం దేశం దిగుమతులపై ఆధారపడటంతో 2022- 23లో 87.4 శాతం నుండి 2023- 24లో 87.7 శాతానికి పెరిగింది. 

భారత్‌లో రిఫైండ్‌ ఆయిల్‌ ఉత్పత్తుల వినియోగం 2022-23లో 223 మిలియన్‌ టన్నులు ఉండగా, 4.6 శాతం పెరిగి 2023-34లో 233.3 మిలియన్‌ టన్నులకు పెరిగింది. పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం, లిక్విడ్‌ పెట్రోలియం వంటి ప్రధాన పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి దారితీసింది.