మరోసారి అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి

దేశంలోనే సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి మరోసారి అప్రూవర్‌గా మారారు. గతంలో ఈడీ కేసులో అప్రూవర్‌గా మారిన శరత్‌ చంద్రారెడ్ తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్‌గా మారారు.
 
అప్రూవర్‌గా మారిన తర్వాత సెక్షన్‌ 164 కింద సీబీఐ కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఆయన స్టేట్‌మెంట్‌ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. దీంతో  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు వ్యవహారంలో సీబీఐ, ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసుల్లోనూ శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారటం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తుంది.
 
ఢిల్లీ మద్యం వ్యవహారం కేసులో ఇటీవల ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక నిందితుడైన శరత్‌ చంద్రారెడ్డిని కవిత బెదిరించారంటూ న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. శరత్‌ చంద్రారెడ్డిని రూ.25 కోట్లు కవిత డిమాండ్‌ చేశారని కోర్టుకు వివరించింది. ఈ నెల 23వ తేదీ వరకు కవితకు సీబీఐ కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. జ్యుడీషియల్ రిమాండ్‌కి ఇచ్చిన 4 రోజుల్లో సీబీఐ కేసులో అప్రూవర్‌గా మారి శరత్ చంద్రారెడ్డి స్టేట్‌మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఈడీ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్ట్ చేయటమే కాకుండా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమె పాత్ర ఉందని తెలిపేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలను సంపాధించే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే కవితకు బెయిల్ ఇవ్వొద్దని, ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని కోర్టులో సీబీఐ వాదిస్తోంది.