చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా అథిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రాగన్ తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని, అక్కడ తన సైనిక ఆపరేషన్లను దాచి పెడుతోందని చట్టసభ సభ్యులకు వెల్లడించారు.
“దశాబ్దకాలంగా ఈ రంగంలో చైనా అసాధారణ ప్రగతి సాధించింది. అదంతా ఎంతోరహస్యంగా సాగింది. పౌర కార్యక్రమాల ముసుగులో మిలిటరీ ప్రాజెక్టులను చేపట్టిందని భావిస్తున్నాం. అయితే అమెరికా కూడా దీటుగానే ఈ రేసులో ఉన్నది. చంద్రుడిపైకి వెళ్లడం ప్రస్తుతం మనపై ఉన్న బాధ్యత” అని తెలిపారు.
చైనా అక్కడకు ముందుగానే వెళ్తే, ఇది మా ప్రదేశం, మీకు స్థానం లేదనే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ రంగంలో దూసుకెళ్లేందుకు చైనా బడ్జెట్లో భారీ కేటాయింపులు చేస్తోందని మనం గమనించాలని ఆయన సూచించారు. అన్నింటికి సిద్ధంగా ఉండటం మంచిదని ఆయన కాంగ్రెస్ సభ్యులకు హితవు చెప్పారు.
2025 ఏడాదికి నాసా బడ్జెట్ కేటాయింపుల అంశంలో భాగంగా అమెరికా ప్రతినిధుల సభకు చెందిన కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. దానిలో భాగంగానే తన ఆందోళనలను వెలిబుచ్చారు. ఇదిలా ఉంటే చంద్రుడిపై శాశ్వత నివాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా నాసా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టింది. దీని ద్వారా సుమార్ 50 ఏళ్ల తరువాత జాబిల్లిపై మనిషిని పంపనుంది. ఇప్పటికే ఆర్టెమిస్ 1 నింగి లోకి దూసుకెళ్లగా రానున్న రోజుల్లో ఆర్టెమిస్ 2 , 3 లను ప్రయోగించనుంది.
More Stories
ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాల ప్రయోగం!
విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి