రాజ్యాంగం మారుస్తామని తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు

రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్‌ పాల్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు. 
 
ప్రస్తుతం దేశంలో గాలి చూస్తుంటే బీజేపీ 370 సీట్లు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు 30కిపైగా సీట్లు గెలుచుకుంటాయని భరోసా వ్యక్తం చేశారు. దక్షిణ భారతంలోనూ ఎన్డీయే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కానున్నారని చెబుతూ మైనార్టీలు, దళితులను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
అయినా, విజయం సాధించలేరని స్పష్టం చేశారు. 
 
కేశవానంద భారతి కేసులో ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చలేమని తేల్చిచెప్పారని గడ్కరీ గుర్తు చేశారు. 80సార్లు మార్పులు చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పాపానికి పాల్పడిన కాంగ్రెస్.. రాజ్యాంగం మారుస్తామని మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. మౌలిక సదుపాయాల్లో మార్పులు అభివృద్ధిని వేగవంతం చేస్తాయని చెబుతూ ఈ దిశలో తాము పని చేస్తున్నామని పేర్కొన్నారు. 
 
రోప్ వేలు, కేబుల్ కార్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్తుతో ప్రజా రవాణాను నడుస్తోందని.. మరిన్ని నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో మెట్రో రైళ్లను విస్తరించనున్నట్లు తెలిపారు. భారతదేశంలో హైపర్ లూప్ టెక్నాలజీ ప్రవేశం చూశామని.. ప్రస్తుతం గ్రీన్‌వే నిర్మిస్తున్నామని గడ్కరీ వివరించారు. డిసెంబర్ 2024 నాటికి దేశంలోని జాతీయ రహదారులు అమెరికాతో సమానంగా ఉంటాయని పేర్కొంటూ చైనా, అమెరికాలను వదిలి ఐదేళ్లలో నెంబర్‌వన్‌ అవుతామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, దేశం మరింత బలపడుతుందని చేయొచ్చని గడ్కరీ భరోసా వ్యక్తం చేశారు. 

పదేళ్ల సంవత్సరాల పని మహారాష్ట్రతో సహా దేశవ్యాప్తంగా మంచి ఫలితాలను ఇస్తుందని తెలిపారు. బీజేపీతో పాటు శివసేన (షిండే వర్గం), ఎన్‌సీపీ (అజిత్ వర్గం) ట్రిపుల్ ఇంజిన్ కలిగి ఉండడం ఎన్‌డీఏ బలాన్ని పెంచుతుందని చెప్పారు. శివసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు చాలా మంది ఏకనాథ్ షిండే వెంట ఉన్నారని పేర్కొంటూ సహజంగా అదే నిజమైన శివసేన అని స్పష్టం చేశారు. 

ఈ సారి బారామతిలో కూడా ఎన్డీయే గెలుస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు అంటున్నాయని, అయితే ఇందులో తాము జోక్యం చేసుకోమని, ఏజెన్సీలు తమపని చేస్తున్నాయని తేల్చి చెప్పారు.