ఇప్పుడు బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానం ప్రవేశపెట్టలేం

ఇవిఎం యంత్రాల సాఫ్ట్‌వేర్‌ల్లో మానవుల జోక్యం లేకుండా ఏమైనా సూచనలు ఇవ్వాలని సూచిస్తూ  ఇప్పుడు బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానం ప్రవేశపెట్టలేమని  సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వివిపిఎటి)తో పాటు పోలైన ఓట్ల క్రాస్‌ వెరిఫికేషన్‌ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. 

విచారణ సందర్భంగా రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానంలో నెలకొన్న సమస్యలను కోర్టు ఎత్తిచూపింది. ”బ్యాలెట్‌ పేపర్ల సమయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మీరు మరిచిపోయినా.. మేము మరిచిపోలేదు” అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.

యూరోపియన్‌ దేశాలు ఇవిఎంలను పక్కనపెట్టి బ్యాలెట్‌ పేపర్లకు తిరిగి వచ్చాయని పిటిషన్‌దారులలో ఒకరు, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టుకు తెలిపారు. పేపర్‌ బ్యాలెట్లకు తిరిగి వెళ్లవచ్చు. ఓటర్లకు వివిపిఎటి స్లిప్స్‌ ఇవ్వడం మరో విధానమని అన్నారు. స్లిప్పులను ఓటర్లకు ఇచ్చి బ్యాలెట్‌ బాక్స్‌లో వేయమని సూచించవచ్చని పేర్కొన్నారు. 

వివిపిఎటి డిజైన్‌ మార్చారని, పారదర్శక గాజుకి బదులుగా చీకటిగా ఉండే మిర్రర్‌ గ్లాస్‌ను వినియోగించారని, ఏడు సెకన్లపాటు లైట్‌ ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుందని ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు. జర్మనీని ఉదాహరణగా పేర్కొనగా  జస్టిస్‌ దీపాంకర్‌ తిరస్కరించారు.

జర్మనీలో జనాభా 6 కోట్లు ఉండగా, భారత్‌లో 50-60 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, బ్యాలెట్‌ పేపర్లను తీసుకువస్తే ఏమవుతుందో అందరికీ తెలుసునని జస్టిస్‌ ఖన్నా పేర్కొన్నారు. ఎన్‌జిఒ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) సహా పలువురు న్యాయవాదులు ఈ పిటిషన్‌లను దాఖలు చేశారు.