144 కోట్లకు చేరిన భారత దేశ జనాభా

భారత దేశ జనాభా 144 కోట్లకు చేరిందని అంచనా. ఇందులో 24శాతం మంది 0-14 సంవత్సరాల వయుసున్న ఉన్నారు. ఈ విషయాన్ని యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ నివేదిక పేర్కొంది. అయితే, 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లు. ప్రసవ సమయంలో శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయని నివేదిక వెల్లడించింది. 
 
భారతదేశ జనాభాలో 24 శాతం మంది 0-14 సంవత్సరాల మధ్య వయస్కులు కాగా.. 17శాతం మంది 10-19 సంవత్సరాల మధ్య వయస్కులున్నారు. జనాభాలో 68 శాతం మంది 10-24 ఏళ్ల మధ్య వయస్కులు కాగా, 7 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.  పురుషుల ఆయురార్దం 71 సంవత్సరాలు కాగా, మహిళల ఆయుర్దాయం 74 సంవత్సరాలు. 
 
2006 నుంచి 2023 మధ్య భారత్‌లో బాల్య వివాహాల శాతం 23శాతంగా ఉందని పేర్కొంది. ఇక దేశంలో డెలివరీ సమయంలో మరణాలు తగ్గుముఖం పట్టాయి. పీఎల్‌ఓఎస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ హెల్త్‌ నివేదికను ఉదహరిస్తూ 640 జిల్లాల్లో ప్రసవానంతర మరణాల నిష్పత్తి లక్ష జననాల్లో 70 కంటే తక్కువగా ఉంది. 114 జిల్లాల్లో ఈ నిష్పత్తి 210 కంటే ఎక్కువగా ఉంది. 
 
వికలాంగులు, శరణార్థులు, జాతి మైనారిటీలు, క్వీర్ కమ్యూనిటీలు, హెచ్‌ఐవీతో బాధితులతో పాటు అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు, బాలికలు అత్యధిక లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వేదిక పేర్కొంది. చదువుకునే, పని ప్రదేశాల్లో కుల వివక్షను ఎదుర్కొంటున్న మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించాలని భారతదేశంలోని దళిత ఉద్యమకారులు డిమాండ్‌ చేస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది. 
 
కొన్ని కుటుంబాలు పూర్తిగా నిరుపేదలుగా మిగిలిపోతాయని, తమ కుటుంబాలను పోషించలేరని, వారి పిల్లలను పేదరికం నుంచి బయటకు తీసుకురాలేరు. ఇది పేలవమైన లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే చట్రానికి దోహదం చేస్తుంది. దాదాపు సగం మంది దళిత మహిళలకు ప్రసవానంతర సంరక్షణ అందడం లేదు. 
 
ప్రతిరోజూ 800 మందికిపైగా మహిళలు ప్రసవ సమయంలో మరణిస్తున్నారని నివేదిక తెలిపింది. నాలుగో వంతు మంది మహిళలు తమ భాగస్వామితో శృంగారాన్ని నిరాకరించలేకపోతున్నారు. ప్రతి పది మంది మహిళల్లో ఒకరు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లుగా నివేదిక పేర్కొంది. ఇక అంగవైకల్యం లేని వారితో పోలిస్తే.. ఆ సమస్యను కలిగి ఉన్న మహిళలు 10 రెట్లు ఎక్కువగా లింగ ఆధారిత హింసను అనుభవిస్తున్నారని వివరించింది.
ఇక ఆరోగ్య సంరక్షణను పొందటంలో మెరుగుదల అనేది ప్రధానంగా సంపన్న మహిళలకు, ఇప్పటికే ఆరోగ్య సంరక్షణకు మెరుగైన అవకాశాన్ని కలిగి ఉన్న జాతి సమూహాలకు చెందిన వారికి ప్రయోజనం చేకూర్చాయని సమాచారం. వాతావరణ మార్పు, మానవతా సంక్షోభాలు, సామూహిక వలసలు వంటి బలమైన శక్తులతో వారి దుర్బలత్వం మరింత పెరుగుతున్నదనీ నివేదిక హెచ్చరించింది.