అయోధ్య రామయ్యకు రేపే సూర్య తిలకం

శ్రీరామనవమికి అయోధ్య నగరం ముస్తాబవుతున్నది. 500 సంవత్సరాల తర్వాత వేడుకలు జరుగుతుండడంతో ఘనంగా నిర్వహించేందుకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తున్నది. అయితే, శ్రీరామనవమి ఉత్సవం రోజున భక్తులు అపురూప ఘట్టాన్ని వీక్షించబోతున్నారు. బాల రాముడి నుదుటన సూర్య భగవానుడి కిరణాలు ప్రసరించనున్నాయి. 
 
ఈ నెల 17న మధ్యాహ్నం 12.16 గంటలకు దాదాపు ఐదు నిమిషాల ఈ అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేయనున్నది.  ఈ మేరకు సాంకేతిక ఏర్పాట్లు చేస్తున్నట్లు రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. సోమవారం అయోధ్యకు చేరుకున్న ఆయన నవమి ఉత్సవాల జిల్లా అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించనున్నారు. 

రామనవమికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సులభంగా రామ్‌లల్లా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ మాట్లాడుతూ.. 19వ తేదీ వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.శ్రీరామ నవమి రోజున రామ్‌లల్లా దర్శన సమయాలు మారుతాయన్నారు.

బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారు జామున 3.30 గంటల నుంచి మంగళ హారతి, అభిషేకం, అలంకరణ, దర్శనాలు ఉంటాయన్నారు. ఉదయం 5.00 గంటలకు శృంగార్ హారతి ఉంటుందని పేర్కొన్నారు.  దర్శనాలు, పూజా కార్యక్రమాలు ఏకకాలంలో కొనసాగుతాయని.. నైవేద్యం సమర్పించే సమయంలో కొద్దిసేపు దర్శనాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయని.. పరిస్థితులకు అనుగుణంగా భోగ్‌, శయన హారతి ఉంటుందని చెప్పారు.