ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం ఎక్కువే

దేశంలో ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య నాలుగు నెలల కాలానికి దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ) 87 సెంటీమీటర్లతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావొచ్చని అభిప్రాయపడింది.
 
లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది.  ఐఎండీ చీఫ్‌ మృత్యంజయ్‌  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ1951 నుంచి 2023 వరకు ఉన్న డేటా ప్రకారం లానినా, ఎల్‌నివో సంఘటనలను అనుసరించి భారత్‌లో తొమ్మిది సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. 
 
ఇక గత నాలుగు సంవత్సరాల రుతుపవనాల సీజన్‌లో సాధారణ, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. ఈ సారి వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. జులై నాటికి దేశమంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపారు.
 
మరోవైపు, ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా ఇలాంటి అంచనాలనే వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి దేశంలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ఇటీవల అంచనా వేసింది. నాలుగు నెలల సుదీర్ఘ కాలానికి దీర్ఘ కాల సగటు 868.6 మిల్లీమీటర్లలో 102 శాతం వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. 
 
మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈశాన్య భారతం, తూర్పు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని వెల్లడించింది.