ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే టాప్‌ 10 విమానాశ్రయాల్లో చోటు దక్కించుకుంది. 2023లో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే టాప్ టెన్ ఎయిర్ పోర్ట్స్‌ జాబితాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) తాజాగా విడుదల చేసింది.

ఈ జాబితాలో అమెరికాలో గల అట్లాంటా ఎయిర్ పోర్ట్‌ తొలి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత దుబాయ్, డల్లాస్/ పోర్ట్ వర్త్, లండన్, యుకే, టోక్యో, జపాన్, డెన్వార్ అమెరికా, ఇస్తాంబుల్- టర్కీ, లాస్ ఏంజెల్స్, చికాగో వరసగా ఉన్నాయి. రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్స్‌ జాబితాలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ పదో స్థానంలో నిలవడం విశేషం.

ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వెల్లడించిన నివేదిక ప్రకారం 2023లో ఢిల్లీ ఎయిర్ పోర్టులో 7 కోట్లా 22 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2022లో మాత్రం రద్దీగా ఉండే జాబితో తొమ్మిదో స్థానంలో నిలవడం విశేషం. 2019లో మాత్రం 17వ స్థానంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ ఉంది.

ఈ విమానాశ్రయం భారతదేశ రాజధానికి ప్రధాన అంతర్జాతీయ గేట్‌వేగా పనిచేస్తోందని ఏసీఐ పేర్కొంది. విమానాశ్రయాల్లో విదేశాల నుంచి ఎక్కువ మంది వచ్చిన వారి జాబితా ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారు. ఇక తొలి స్థానంలో నిలిచిన అట్లాంటా ఎయిర్ పోర్ట్‌ నుంచి దాదాపుగా 104.6 మిలియన్ల మంది ప్రయాణికులు ట్రావెల్ చేసినట్లు నివేదికలో వెల్లడైంది. 

ఆ తర్వాత దుబాయ్ ఎయిర్ పోర్ట్‌ నుంచి 86.99 మిలియన్స్‌ మంది ప్రయాణించారని పేర్కొంది. మూడో స్థానంలో నిలిచిన డల్లాస్/ పోర్ట్ వర్త్ విమానాశ్రయం నుంచి దాదాపుగా 81.75 మిలియన్స్‌ మంది , లండన్‌లోని హిత్రూ విమానాశ్రయం నుంచి 79.18 మిలియన్స్‌, టోక్యో ఎయిర్‌పోర్ట్‌ నుంచి 78.7 మిలియన్స్‌ మంది తమ గమ్యస్థానాలకు ప్రయాణించారు.

ప్రపంచంలోనే టాప్‌ టెన్‌ అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఐదు ఎయిర్‌పోర్ట్స్‌ అమెరికాలోనే ఉండటం విశేషం. 2023లో అంతర్జాతీయంగా ప్రయాణించిన మొత్తం ప్రయాణికుల సంఖ్య దాదాపుగా 850 కోట్లుగా ఉన్నట్లు ఏసీఐ పేర్కొంది. 2022తో పోలిస్తే ఇది 27.2 శాతం వృద్ధి కనిపిస్తోందని తెలిపింది.